రాజకీయాలతో పాటు ఏ వ్యవస్థకైనా ఒక హద్దు ఉంటుంది. దాన్ని దాడితే అసహ్యం వేస్తోంది. తాజాగా ఎంపీ విజయ సాయి రెడ్డి ట్వీట్ చదవితే రాజకీయాలపై వెగటుపుట్టేలా ఉంది. ఆయనకున్న ఆక్రోశం హద్దులు దాటి చంద్రబాబు చావును కోరుతూ చేసిన ట్వీట్ విజయ సాయి రెడ్డి వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తోంది.
సాధారణంగా చంద్రబాబు, లోకేష్ ట్వీట్ల పై ఘాటుగా విజయ సాయి రెడ్డి స్పందిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో పరిధులు దాటి ట్వీట్ చేసినప్పటికీ హద్దు మీరలేదు. ఈసారి ఆయన హద్దు మీరడమే కాదు, కోడెల పిలుస్తున్నాడంటూ చంద్రబాబు చావును కోరుతూ ట్వీట్ చేయడం ఏపీ రాజకీయాల పతనానికి నిదర్శనంగా ఉంది. కర్నూలు జిల్లాల్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సాయి రెడ్డి తనదైన స్టైలో ట్విట్టర్ వేదికగా రెచ్చిపోయారు.
నైరాశ్యంతో పోయేట్టున్నాడు మా చంద్రం అన్నయ్య. నాలుగు రోజులు కట్టేసైనా ఇల్లు కదలకుండా చేయండయ్యా! కుప్పం ప్రజలు తరిమికొట్టినప్పుడే లాస్ట్ ఎలక్షన్ అని అర్థమైంది. మనకు మళ్లీ ఈ ఏడుపులేంటి అన్నయ్యా? పైనుంచి కోడెల గాని పిలుస్తున్నాడా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 18, 2022
ఈసారి గెలిపించకపోతే తనకు ఇవే చివరి ఎన్నికలంటూ చంద్రబాబు కర్నూలు జిల్లా టూర్లో చేసిన వ్యాఖ్యల్ని ఉద్దేశించి విజయ సాయి రెడ్డి వ్యంగాస్త్రాలు సంధించారు. చంద్రబాబు పై వ్యక్తిగతంగా విరుచుకుపడ్డారు. చంద్రబాబును ఇంట్లో కట్టేయాలంటూ సాయి రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో కుప్పం స్ధానిక ఎన్నికల్లో టీడీపీ ఓటమిని గుర్తుచేస్తూ చంద్రబాబును ఓ ఆటాడుకున్నారు. అంతటితో ఆగకుండా మూడేళ్ల క్రితం చనిపోయిన మాజీ మంత్రి కోడెలను కూడా ఇందులోకి లాగారు.
Also Read: AP Politics: మూడు ముక్కలాట! ఎవరికి వారే విజేతలు..!
కర్నూలులో చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ ` నైరాశ్యంతో పోయేట్టున్నాడు మా చంద్రం అన్నయ్య. నాలుగు రోజులు కట్టేసైనా ఇల్లు కదలకుండా చేయండయ్యా ! కుప్పం ప్రజలు తరిమికొట్టినప్పుడే లాస్ట్ ఎలక్షన్ అని అర్ధమైంది. మనకు మళ్లీ ఈ ఏడుపులేంటి అన్నయ్యా ? పై నుంచి కోడెల పిలుస్తున్నాడా.` అంటూ సాయి రెడ్డి తన ట్వీట్ ముగించారు. తద్వారా ఎప్పుడో కుప్పంలో ఓడినప్పుడే మీకు లాస్ట్ ఎలక్షన్ అయిందని, ఇప్పుడు మళ్లీ కర్నూల్లో వచ్చే ఎన్నికలు చివరివంటూ చంద్రబాబు చెప్పడమేంటనే విషయాన్ని సాయి రెడ్డి ప్రశ్నించారు. అంత వరకు బాగానే ఉంది. పై నుంచి కోడెల పిలుస్తాన్నాడా..? అంటూ ట్వీట్ ను ముగించడం సాయి రెడ్డి మనస్తత్వాన్ని తెలియచేస్తోంది.