రాష్ట్రంలోని(AP ) 3,396 మద్యం దుకాణాలకు (Liquor Shops) వచ్చిన 89,882 దరఖాస్తులను ఈరోజు ఎక్సైజ్ శాఖ లాటరీ (Lucky Draw for AP Wine Shops) తీయనుంది. విజేతలుగా నిలిచిన వారికి రేపు వైన్ షాపులను అప్పగించనుంది. ఎల్లుండి నుంచి రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. మద్యం షాపులకు దరఖాస్తుల ప్రక్రియ పూర్తికావడంతో అందరి దృష్టి లాటరీ పైనే పడింది. ఎవర్ని అదృష్టం వరిస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారు దేవుళ్ళకు మొక్కులు మొక్కుకుంటున్నారు. జిల్లాలో ఎంపిక చేసిన ప్రత్యేక కేంద్రంలో జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో లాటరీ నిర్వహించనున్నారు. ఈ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసుశాఖ గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంది.
లాటరీ ప్రక్రియ ఈరోజు (సోమవారం ) ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తుదారులు ఉదయం 7 గంటలకే ఈ కేంద్రానికి చేసుకోవాల్సి ఉంది. లాటరీ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఎంపికైన వారి వివరాలను అధికారులు వెల్లడిస్తారు. మరోవైపు మద్యం దుకాణాలకు ఆయా ప్రాంతాల్లో జనాభాను బట్టీ లైసెన్స్ ఫీజు రూ.50, 55, 65, 85 లక్షలుగా నాలుగు శ్లాబులను ఏర్పాటు చేశారు. ఎంపికైన అభ్యర్థులు లైనెన్స్ ఫీజు 6 వాయిదాల్లో చెల్లించేందుకు అవకాశం కల్పించారు. మొదటి వాయిదాను 24 గంటల వ్యవధిలో చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ ఫీజు రెండో ఏడాది 10 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను 15వ తేదీ పూర్తి చేసి షాపులను లాటరీలో ఎంపికైన వారికి అప్పగిస్తారు. 16వ తేదీ నుంచి ప్రైవేటు మద్యం షాపులు అమ్మకాలను ప్రారంభించనున్నాయి.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా 3వేల 396 మద్యం దుకాణాలకు మొత్తం 89వేల 882 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి 1797.64 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువగా దరఖాస్తులు రాగా.. వాటిని పున:పరిశీలించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని 113 దుకాణాలకు అత్యధికంగా 5వేల 764 దరఖాస్తులు వచ్చాయి.
Read Also :Airfares Drop: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన టిక్కెట్ల ధరలు..!