ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును 2027 గోదావరి పుష్కరాల లోపు పూర్తి చేసేందుకు కేంద్రం పూర్తిస్థాయిలో సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని చంద్రబాబు కేంద్ర మంత్రికి వివరించారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయిందని, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) పరిధిలోని గ్యాప్ 1, గ్యాప్ 2 పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల తాగునీటి కష్టాలు తీర్చే పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే, ‘ప్రధానమంత్రి కృషి సించాయి యోజన’, ‘హర్ ఖేత్ కో పానీ’ కార్యక్రమాల కింద రాష్ట్రంలోని చెరువులు, కుంటల మరమ్మతులు, ఆధునీకరణ పనుల కోసం రూ. 285 కోట్లు విడుదల చేయాలని చంద్రబాబు కోరారు. కాలువల పూడికతీత, గట్ల బలోపేతం వంటి పనులకు ఈ నిధులు అవసరమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
