KCR on Vizag Steel Plant : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఉక్కు కర్మాగారాన్ని కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగానే ఉక్కు కర్మాగార బిడ్డింగ్ లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. వివరాలలోకి వెళితే..
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రవేటీకరణ చేసేందుకు కేంద్రం యోచిస్తున్నది. అయితే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏపీలో నిరసనలు వెల్లువెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం సైతం కేంద్ర నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఏపీలో బిఆర్ఎస్ పార్టీ తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఇప్పటికే పలువురు సీనియర్లను పార్టీలో చేర్చుకుంది. ఇలాంటి తరుణంలో కేసీఆర్ (KCR) మరోసారి తన మార్క్ ను ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. ఉక్కు కర్మాగార నిర్వహణకు నిధులు మరియు ముడిసరుకు ఇచ్చి… నిబంధనల మేరకు ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు సదరు యాజమాన్యం నిర్వహించే బిడ్డింగ్ లో పాల్గొనేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విశాఖ వెళ్లి అధ్యయనం చేయాలని ఉన్నత అధికారులకు సీఎం కేసీఆర్ (KCR) దిశానిర్దేశం చేశారు. రెండు మూడు రోజుల్లో తెలంగాణ అధికారులు విశాఖ వెళ్లనున్నట్టు విశ్వసనీయ సమాచారం.
తెలంగాణాలో సింగరేణి ప్రవేటీకరణకు కేంద్రం యోచిస్తున్నదని ఎప్పటినుంచో కేంద్రంపై విమర్శలు చేస్తుంది తెలంగాణ సర్కార్. సింగరేణిని ప్రవేటీకరణ చేస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తూనే ఉంది. అయితే సింగరేణి ప్రవేటీకరణ విషయంలో కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదన చేయలేదు. ఓ వైపు రాష్ట్ర బీజేపీ నేతలు సింగరేణిని తెలంగాణ ప్రభుత్వం ప్రవేటీకరణ చేస్తున్నదని కామెంట్స్ చేస్తుంటే… లేదు కేంద్రమే చేస్తున్నదని రాష్ట్ర సర్కార్ తిప్పి కొడుతోంది. ఏదేమైనా సింగరేణి, విశాఖ ఉక్కు కర్మాగార విషయంలో తెలంగాణ జోక్యం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటున్నది.
Also Read: Tamilisai Decision on Pending Bills: పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం