YS Jagan : పల్నాడు జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న రోడ్ యాక్సిడెంట్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సింగయ్య అనే వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే. ఘటనకు సంబంధించిన వీడియోపై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) తన నివేదికను పోలీసులకు అందజేసింది. ఆ వీడియో అసలైనదేనని, ఎలాంటి మార్ఫింగ్ జరగలేదని నివేదికలో తేలిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
జగన్ ప్రయాణిస్తున్న కారు ముందు సింగయ్య నలిగిపోతున్న దృశ్యం ఒక సెల్ఫోన్ కెమెరాలో రికార్డై, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ వీడియో నకిలీదని, మార్ఫింగ్ చేసి జగన్ను ఇరికించేందుకు కుట్ర చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులు సెల్ఫోన్ వీడియోతో పాటు డ్రోన్ ఫుటేజీని ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. వీడియో తీసిన ఫోన్ ID, లొకేషన్, టైమ్స్టాంప్ తదితర సాంకేతిక వివరాలపై విశ్లేషణ చేసిన నిపుణులు, ఆ వీడియోలో ఎటువంటి ఎడిటింగ్ జరగలేదని స్పష్టం చేశారు.
ఇక ఈ కేసులో జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జూలై 1న హైకోర్టులో విచారణ జరగనుంది. అదే రోజున ఫోరెన్సిక్ నివేదికను కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. ఇప్పటికే అడ్వకేట్ జనరల్ ప్రాథమిక నివేదికను కోర్టుకు సమర్పించగా, పూర్తి ఆధారాలు ఇవ్వడానికి గడువు కోరగా కోర్టు అంగీకరించింది.
ఈ కేసులో గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు విచారణను గంభీరంగా కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పరిశీలించి, ఫిట్నెస్ సర్టిఫికెట్ను సేకరించారు. దాదాపు 10 మంది ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు కూడా నమోదు చేశారు. ఈ కేసులో జగన్తో పాటు డ్రైవర్ రమణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనీ తదితరులపై నిందితులుగా కేసు నమోదు చేశారు.
అయితే, ప్రధాన నిందితుడిగా ఉన్న డ్రైవర్ – ఏఆర్ కానిస్టేబుల్ రమణారెడ్డి విచారణకు పూర్తిగా సహకరించడంలేదని సమాచారం. ప్రమాద సమయంలో కారు బానెట్పై ఓ కార్యకర్త ఉండడంతో ఏమి కనిపించలేదని, సింగయ్య చక్రాల కింద పడ్డ విషయం తనకు తెలియదని వాదిస్తున్నట్టు తెలుస్తోంది. అయినప్పటికీ, వీడియోలో స్థానికుల హెచ్చరికల తర్వాత కారును వెనక్కి తీసిన దృశ్యాలు ఉన్నప్పటికీ, డ్రైవర్ తన మాటల్ని మార్చుకోలేదని అధికారులు అంటున్నారు. ఈ కేసు ఫోరెన్సిక్ నివేదికతో కీలక మలుపు తిరగగా, జూలై 1న హైకోర్టు విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.
Stampede: మరో తొక్కిసలాట.. ముగ్గురు భక్తులు మృతి, 50 మందికి గాయాలు.. వీడియో ఇదే!