60 Boats Burnt : విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ బోటులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పక్కనే ఉన్న ఇతర బోట్లకు వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 60 బోట్లు కాలిపోయాయని గుర్తించారు. మొత్తం ఆస్తినష్టం రూ.30 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. బోట్లలో నిద్రిస్తున్న వారు మంటల్లో చిక్కుకొని ఉంటారని భావించినప్పటికీ.. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మూడు రోజుల క్రితం సముద్రంపైకి వేటకు వెళ్లిన బోట్లు కూడా ఆదివారం సాయంత్రం విశాఖ తీరానికి చేరాయి. ఒక బోటులో చమురు, పెట్రోలు, ఇతరత్రా మండే స్వభావమున్న పదార్థాలను ఉంచడంతో.. ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ఈక్రమంలో సముద్ర గాలులకు మంటలు వేగంగా పక్కనున్న బోట్లకు విస్తరించాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఒక్కో బోటులో రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలు విలువ చేసే మత్స్య సంపద ఉంది. ఉదయం వాటిని వేలం వేసి విక్రయించాల్సి ఉంది. మత్సకారుల్లో కొంతమంది ధైర్యంగా వారి బోట్లను సముద్రంలోకి తీసుకుపోవడంతో కొంత నష్టం(60 Boats Burnt) తగ్గింది.