బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాల కారణంగా ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడుతున్నాయి. వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. ఇవాళ విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామారాజు, పోలవరం, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వానలు పడతాయంటున్నారు. ఉరుములు, మెరుపులు ప్రారంభం కాగానే పొలాల్లో పనిచేసే రైతులు, శ్రామికులు, పశుకాపరులు సురక్షితమైన భవనాల్లోకి వెళ్లాలి.
మంగళవారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వానలు పడ్డాయి. మరికొన్నిచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. మంగళవారం రోజు నెల్లూరు జిల్లా కావలిలో 39.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి రుతుపవనాలు చురుగ్గా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని, ఈ నెల 26, 27 తేదీల్లో అక్కడక్కడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఉందన్నారు. రాష్ట్రంలో 26, 27 తేదీల్లో ఉత్తర కోస్తా, కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయంటున్నారు.
ఉత్తర కోస్తాలో ఈ నెల 26, 27 తేదీల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందంటున్నారు. ఈదురు గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. కోస్తాలో ఈ నెల 26 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ నెల 26 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. మొత్తం మీద రాష్ట్రంలో వర్షాలు ఊపందుకుంటాయని వాతావరణశాఖ చెబుతోంది. అలాగే రుతుపవనాలు కూడా విస్తరిస్తాయనడంతో అందరూ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే రాష్ట్రంపై ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఉంటుందని కూడా చెబుతున్నారు.
