Anganwadi Workers : ఏపీలోని అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్

గతంలో రూ. 4,200గా ఉన్న అంగన్‌వాడీల వేతనాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం రూ. 11,500లకు పెంచిందని, ఇప్పటివరకు మూడుసార్లు వేతనాలు పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆమె స్పష్టం చేశారు

Published By: HashtagU Telugu Desk
Anganwadi Workers ...

Anganwadi Workers ...

Government Announces Key Update on Anganwadi Workers : ఆంధ్రప్రదేశ్‌లోని అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అంగన్‌వాడీల సంక్షేమంపై కీలక ప్రకటనలు చేశారు. గతంలో రూ. 4,200గా ఉన్న అంగన్‌వాడీల వేతనాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం రూ. 11,500లకు పెంచిందని, ఇప్పటివరకు మూడుసార్లు వేతనాలు పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆమె స్పష్టం చేశారు. అంగన్‌వాడీలు కోరిన 10 డిమాండ్లలో ఇప్పటికే 9 హామీలను నెరవేర్చామని, మిగిలిన సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

అంగన్‌వాడీ కేంద్రాల ఆధునీకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సుమారు రూ. 75 కోట్లతో 5G స్మార్ట్‌ఫోన్లను అందజేయడంతో పాటు, 20 వేల కేంద్రాలకు ఇండక్షన్ స్టౌలను పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. అంగన్‌వాడీల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లు పూర్తయిన వారికి గ్రాట్యూటీ సౌకర్యం కల్పిస్తామని, ఒకవేళ విధి నిర్వహణలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల ఖర్చుల (మట్టి ఖర్చులు) నిమిత్తం రూ. 15,000 అందజేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో ఉన్న 55,476 అంగన్‌వాడీ కేంద్రాలలో సుమారు 21,756 సొంత భవనాల్లో ఉండగా, అద్దె భవనాల్లో ఉన్న మిగిలిన కేంద్రాల కోసం నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు.

అంగన్‌వాడీల్లో పౌష్టికాహార పంపిణీ మరియు విద్యార్థుల హాజరుపై ప్రభుత్వం సాధించిన పురోగతిని మంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు. చిన్నారులకు రాగి, జొన్నల వంటి బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తున్నామని, గతంలో 70 శాతంగా ఉన్న పిల్లల హాజరు ఇప్పుడు 93 శాతానికి పెరిగిందని వెల్లడించారు. ఈ గణాంకాలతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని మంత్రి గర్వంగా ప్రకటించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లల పెరుగుదలను పర్యవేక్షించే బాధ్యతను టీచర్లు, ఆయాలకు అప్పగించామని, త్వరలోనే జీతాల సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి తుది పరిష్కారం చూపుతామని మంత్రి హామీ ఇచ్చారు.

  Last Updated: 05 Mar 2026, 12:27 PM IST