Site icon HashtagU Telugu

Andhra Pradesh : ఏపీకి కేంద్రం శుభవార్త.. రూ. 765 కోట్ల పెట్టుబడులు.. యువతకు గుడ్ న్యూస్.!

Central Minister Ashwini Va

Central Minister Ashwini Va

ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కాంపోనెంట్‌ పథకం కింద.. రూ. 5,532 కోట్లతో చేపట్టే ఏడు యూనిట్లలో.. ఒక యూనిట్ ఏపీకి రానున్నట్లు తెలిపారు. అందులో భాగంగా సైర్మా కంపెనీ ఏపీలో రూ.765 కోట్లతో మల్టీ లేయర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు యూనిట్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయని కేంద్రం తెలిపింది. మిగతా యూనిట్లు తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో నెలకొల్పనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కాంపోనెంట్‌ పథకం కింద చేపట్టే ఏడు ప్రాజెక్టులో ఒకటి ఏపీలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడు ప్రాజెక్టులను మూడు రాష్ట్రాల్లో రూ. 5,532 కోట్లతో కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ ఆమోదముద్ర వేసిందని.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఏడు ప్రాజెక్టుల్లో మొత్తం రూ.36,559 కోట్ల విలువైన ఉత్పత్తులు తయారు అవుతాయని చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల 5,195 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని.. పరోక్షంగా అనేక మంది ఉపాధి పొందుతారని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో సైర్మా స్ట్రాటెజిక్‌ ఎలక్ట్రానిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ రూ.765 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. మల్టీ లేయర్‌ ప్రింటెండ్‌ సర్క్యూట్‌ బోర్డు తయారుచేసే యూనిట్‌ ఏర్పాటు చేయనుందని చెప్పారు. ఈ పరిశ్రమలో మొత్తం రూ.6,933 కోట్ల విలువైన ఉత్పత్తులు తయారుకానున్నాయి. ప్రత్యక్షంగా 955మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు అంచనాలు ఉన్నాయి. కాగా, ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఇటీవల రియలన్స్ సంస్థ ముందుకు వచ్చింది.

ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కాంపోనెంట్‌ పథకం కింద దేశంలో యూనిట్ల ఏర్పాటు చేయడానికి.. మొత్తం 249 అప్లికేషన్లు వచ్చినట్లు మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. దాదాపు రూ.1.15 లక్షల కోట్లు పెట్టుబడితో.. రూ.10.34 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు తయారు చేయడానికి ఈ కంపెనీలు ముందుకు వచ్చినట్లు తెలిపారు. భారత ప్రభుత్వం చేసే విధానాలపై కాన్ఫిడెన్స్‌కు ఇది నిదర్శనం అని మంత్రి అన్నారు. ఎలక్ట్రానిక్ తయారీ చైన్‌లను దేశీయంగా అభివృద్ధి చేసుకోవడం ఎంత అవసరమో.. కంపెనీల ఉత్సాహమే చెబుతోందన్నారు. ఈ మొత్తం పెట్టుబడుల వల్ల దాదాపు 1.42 లక్షల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. అయితే అందులో ప్రస్తుతానికి రూ.5,500 కోట్ల పెట్టుబడులకు మాత్రమే ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.

సైర్మా కాకుండా.. కేనెస్‌ సర్క్యూట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ తమిళనాడులో నాలుగు యూనిట్లు ఏర్పాటు చేయనుంది. ఇక అస్సెంట్‌ సర్క్యూట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ నెలకొల్పనున్న మరో యూనిట్‌‌తో కలిపి మొత్తం రూ.4,271 కోట్ల పెట్టుబడితో 5 యూనిట్లు తమిళనాడులో ఏర్పాటు కానున్నాయి. ఇక ఏడో యూనిట్‌ను మధ్యప్రదేశ్‌లో.. ఎస్‌ఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌ అనే మరో సంస్థ రూ.496 కోట్లతో ఏర్పాటు చేయనుంది. కాగా, ఈ యూనిట్ల ద్వారా దేశీయంగా కాపర్‌క్లాడ్‌ లామినేట్‌ 100 శాతం, పీసీబీకి 20 శాతం, కెమెరా మాడ్యూల్స్‌లో ఉన్న 15 శాతం డిమాండ్‌ను అందుకోవచ్చని అశ్వినీవైష్ణవ్‌ వివరించారు.

Exit mobile version