ఏపీలో మరో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళల కుమార్తెలకు ‘కళ్యాణలక్ష్మి’ పథకం కింద వివాహాల కోసం ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకే రూ.లక్ష వరకు రుణం అందిస్తారు. ఈ నెల 23వ తేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభించనున్నారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం మరో కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. డ్వాక్రా సంఘాల్లోని మహిళల కుమార్తెల వివాహానికి చేయూత అందించాలని నిర్ణయించింది. కళ్యాణలక్ష్మి పథకం కింద డ్వాక్రా మహిళలు రూ.10 వేల నుంచి రూ. లక్ష వరకు రుణం తీసుకునే అవకాశం కల్పిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 23న కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్)పై నిర్వహించిన సమీక్షలో పథకం ప్రారంభించేందుకు ఆమోదం తెలిపారు. డ్వాక్రా మహిళల కోసం అమలు చేస్తున్న ఈ కళ్యాణలక్ష్మి పథకాన్ని సెర్ప్, స్త్రీనిధి సంస్థలు అమలు చేయనున్నాయి.
ఏపీలో డ్వాక్రా మహిళల కుమార్తెల పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్ష వరకు పావలా వడ్డీకి రుణంగా అందిస్తారు. ఏపీ ప్రభుత్వం 2026-27 నుంచి ఈ పథకం అమలు చేయడానికి రూ.250 కోట్లు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ప్రతి ఏటా కనీసం 25 వేల మంది డ్వాక్రా మహిళల కుమార్తెలకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం పథకాన్ని రూపొందించింది. ఈ కళ్యాణలక్ష్మి పథకాన్ని.. ‘అమ్మాయి పెళ్లి ఆర్థిక భారం కాదు.. ఆమె గౌరవం’ అంటూ ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది.
డ్వాక్రా సంఘం సభ్యురాలి కుమార్తె వివాహానికి ఈ కళ్యాణలక్ష్మి పథకం వర్తిస్తుంది. డ్వాక్రా మహిళల అవసరాన్ని బట్టి రూ.10 వేల నుంచి గరిష్ఠంగా రూ.లక్ష వరకు రుణంగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ రుణాన్ని 4% వడ్డీ(పావలా వడ్డీ)కి ఇస్తారు. అదనంగా ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జీలు ఉండవు. ఈ డబ్బుల్ని వాయిదాల్లో చెల్లించవచ్చు. తీసుకునే రుణాన్ని బట్టి గరిష్టంగా 48 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఈ కళ్యాణ లక్ష్మి పథకం డ్వాక్రా సంఘంలో చేరి ఆరు నెలలు, అంతకంటే ఎక్కువ కాలం ఉన్న సభ్యురాలికి వర్తిస్తుంది. బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, ఉన్నతి ద్వారా రుణాలు తీసుకుని సక్రమంగా చెల్లించే వారికి ఇస్తారు.
డ్వాక్రా మహిళలు ఈ కళ్యాణ లక్ష్మి పథకం కోసం స్థానిక వెలుగు కార్యాలయం లేదా వీవోఏ/యానిమేటర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు అర్హత ఉన్న లబ్ధిదారు బయోమెట్రిక్ అథెంటికేషన్ ఆధారంగా పథకాన్ని అమలు చేస్తారు. అవసరమైన డాక్యుమెంట్లు కూడా ఇవ్వాలి. పెళ్లికి సంబంధించిన లగ్న పత్రిక, ఈవెంట్ నిర్వహణకు సంబంధించిన డాక్యుమెంట్, పెళ్లి ఖర్చు అంచనా వ్యయం అందించాల్సి ఉంటుంది. వివాహానికి సంబంధించిన అన్ని వివరాలను అధికారులు పరిశీలించిన తర్వాత నేరుగా సభ్యురాలి బ్యాంకు అకౌంట్లో డబ్బులు జమ చేస్తారు. డ్వాక్రా మహిళలు కళ్యాణలక్ష్మి పథకం కోసం అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించిన 48 గంటల్లో ప్రాసెస్ అవుతుంది.
