Vangalapudi Anita: రాజకీయ నేతలకు రెట్టింపు ఫైన్.. ట్రాఫిక్ చలానాలపై ఏపీ హోంమంత్రి అనిత

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ట్రాఫిక్ నిబంధనల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రెట్టింపు జరిమానా విధించాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు భద్రత విషయంలో ఎవరికీ మినహాయింపులు ఉండవని, నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలను అరికట్టగలమని ఆమె స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లాలో ‘సురక్షిత రోడ్లు.. సురక్షిత జీవితం’ నినాదంతో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అడ్డరోడ్డు నుంచి నక్కపల్లి […]

Published By: HashtagU Telugu Desk
Ap Home Minister Vangalapud

Ap Home Minister Vangalapud

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ట్రాఫిక్ నిబంధనల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రెట్టింపు జరిమానా విధించాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు భద్రత విషయంలో ఎవరికీ మినహాయింపులు ఉండవని, నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలను అరికట్టగలమని ఆమె స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లాలో ‘సురక్షిత రోడ్లు.. సురక్షిత జీవితం’ నినాదంతో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు.

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అడ్డరోడ్డు నుంచి నక్కపల్లి వరకు జరిగిన ఈ బైక్ ర్యాలీలో మంత్రి అనిత మాట్లాడుతూ, “లక్షల రూపాయలు పెట్టి బైక్ కొనేవారు, ప్రాణాలను కాపాడే వెయ్యి రూపాయల హెల్మెట్‌ను కొని ధరించడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది హెల్మెట్ లేకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారు. ప్రాణం విలువను ప్రతి ఒక్కరూ గుర్తించాలి” అని అన్నారు.

ఈ సందర్భంగా తన పాయకరావుపేట నియోజకవర్గంలో జరిగిన రోడ్డు ప్రమాదాలను గుర్తుచేసుకుని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు. మన నియోజకవర్గంలో ఒకే నెలలో జరిగిన రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశాయి. ఇకనైనా మేల్కొని ‘హెల్మెట్ ధరిద్దాం – సురక్షితంగా పయనిద్దాం’ అనే నినాదాన్ని పాటిద్దాం. మన ప్రాణాలను, మన కుటుంబాల భవిష్యత్తును కాపాడుకుందాం” అని అనిత పిలుపునిచ్చారు. ర్యాలీలో భాగంగా ఆమె పలువురు వాహనదారులకు స్వయంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించి, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని కోరారు.

  Last Updated: 06 May 2026, 11:27 AM IST