Free Bus : ‘ఉచిత బస్సు ప్రయాణ’ వసతి ఆంధ్రప్రదేశ్లోనూ అమల్లోకి రానుంది. అయితే మహిళల కోసం కాదు !! విద్యార్థులకు మాత్రమే. మార్చి నెల నుంచి ఆంధ్రప్రదేశ్లో టెన్త్, ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. టెన్త్, ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత ప్రయాణ వసతిని కల్పించాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి.. పరీక్షా కేంద్రాలకు ఉచితంగా వెళ్లొచ్చు. విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి.. ఎగ్జామ్ సెంటర్ల వరకూ ఉచితంగా చేరుకోవచ్చు. పరీక్ష పూర్తైన తర్వాత ఇళ్లకు కూడా ఫ్రీగానే బస్సుల్లో రావచ్చు. అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసులకు మాత్రమే వర్తిస్తుంది. విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
We’re now on WhatsApp. Click to Join
ఏపీలో ఈ ఏడాది పది, ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య సుమారు 16 లక్షల వరకూ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మార్చి ఒకటో తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానుండగా.. మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణలో అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు మహాలక్ష్మి పథకం పేరిట ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలుచేస్తోంది. ఇక ఈ పథకం కారణంగా ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ కూడా పెరిగింది. బస్సులో తిరిగే వారి సంఖ్య పెరగడం, జీరోటికెట్ల డబ్బులను ఆర్టీసీకి(Free Bus) ప్రభుత్వమే చెల్లిస్తుండటంతో అటు ఆర్టీసీ, ఇటు మహిళలు సంతోషంలో ఉన్నారు. అయితే ఏపీలోనూ ఇలాంటి పథకం తేవాలని అప్పట్లో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని టీడీపీ ఇప్పటికే హామీ ఇచ్చింది.