Vijayawada to Mumbai Flight : రెండు రోజుల క్రితమే కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. అంతలోనే ఏపీకి ఆ శాఖ నుంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈరోజే విజయవాడ నుంచి ముంబైకు విమాన సర్వీసులు మొదలు కాబోతున్నాయి. ఈ సర్వీసులను ఇవాళ సాయంత్రం గన్నవరం విమానాశ్రయం వేదికగా మచిలీ పట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కలిసి ప్రారంభించనున్నారు. వారిద్దరు కలిసి ప్రయాణికులకు బోర్డింగ్ పాస్లను అందజేస్తారు. ఈసందర్భంగా ఎయిర్పోర్టులో ఈ విమానంపైకి(Vijayawada to Mumbai Flight) వాటర్ వెదజల్లి ఇక్కడి సిబ్బంది ఘనస్వాగతం పలకనున్నారు.
We’re now on WhatsApp. Click to Join
వాస్తవానికి నెల రోజుల క్రితమే ఎయిరిండియా సంస్థ విజయవాడ-ముంబై నగరాల నడుమ టికెట్ బుకింగ్స్ను షురూ చేసింది. కరోనా మహమ్మారి తీవ్రరూపు దాల్చడానికి ముందు వరకు విజయవాడ – ముంబై మధ్య ఫ్లైట్ నడిచేవి. కరోనా టైంలోనే ఈ విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇటీవల ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ రిక్వెస్టు మేరకు మళ్లీ ఆ విమాన సర్వీసులను మొదలుపెట్టారు. ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వాహకులు ఎయిరిండియాతో పాటు పలు విమానయాన సంస్థలకు, ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు రాసిన లేఖలకు ఈమేరకు సానుకూల ఫలితం వచ్చింది. దాదాపు నెల రోజుల క్రితమే వారంతా ఓకే చెప్పారు. అందుకే అప్పటి నుంచే టికెట్ల బుకింగ్ను ప్రారంభించారు.