ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆతిథ్య రంగంలో పెట్టుబడుల్ని ఆకర్షిస్తోంది. నూతన పర్యాటక విధానంలో భాగంగా హోటల్స్కు రాయితీలు, ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలులో ఫైవ్స్టార్ హోటల్ నిర్మాణానికి మరో సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించగా.. రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. ఈ హోటల్ను రూ.82.49 కోట్లతో ఒంగోలుకు సమీపంలోని చదలవాడలో నిర్మించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో పెట్టుబడుల్ని ఆకర్షించే పనిలో ఉంది. పరిశ్రమలతో పాటుగా పర్యాటకశాఖ ద్వారా కూడా ఆతిథ్య రంగంలో కొత్త హోటల్స్ ఏర్పాటుకు అనుమతులు ఇస్తూ పెట్టుబడుల్ని ఆకర్షిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు నగరాల్లో ఆతిథ్య రంగానికి చెందిన సంస్థలు హోటళ్ల నిర్మాణానికి ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే పలు నగరాల్లో హోటళ్లు ఏర్పాటు చేసేందుకు ప్రముఖ సంస్థలు ముందుకొచ్చాయి.. ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. అమరావతి, విశాఖ, విజయవాడ, ఉభయ గోదావరి జిల్లాలు, తిరుపతిలో కొత్త హోటళ్లు ఏర్పాటు చేయనున్నారు. నూతన పర్యాటక విధానంలో భాగంగా ఈ హోటల్స్కు అవసరమైన రాయితీలు కూడా అందిస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో మరో కొత్త హోటల్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
ప్రకాశంజిల్లా ఒంగోలు నగరానికి సమీపంలోని చదలవాడ గ్రామంలో రవిప్రియ హాస్పిటాలిటీస్ సంస్థ హోటల్ నిర్మించనుంది. మొత్తం రూ.82.49 కోట్ల పెట్టుబడులతో, 123 గదులతో ఫైవ్స్టార్ హోటల్ ప్లాన్ చేశారు.. ఈ హోటల్ ద్వారా 120మందికి ఉపాధి లభిస్తుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన పర్యాటక విధానం 2024-29 ప్రకారం పలు రాయితీలు అందిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. రాష్ట్ర పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. హోటల్ నిర్మాణానికి సంబంధించి రవిప్రియ సంస్థ ప్రతిపాదనల్ని ఈ ఏడాది మార్చి 28న నిర్వహించిన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదించారు. హోటల్ నిర్మాణానికి సంబంధించి అవసరమైన పలు ప్రోత్సాహకాలు అందించాలని పర్యాటక శాఖకు సిఫార్సు చేశారు. ఈ మేరకు మూలనిధి పెట్టుబడి, స్టాంప్ డ్యూటీ, విద్యుత్ ఛార్జీలు వంటి వాటిలో ప్రభుత్వం తరఫు నుంచి ప్రోత్సాహకాలు అందించనున్నారు.
ఒంగోలుకు దాదాపు 15 కిలోమీటర్ల దూరంలోని చదలవాడ గ్రామంలో ఈ ఫైవ్ స్టార్ హోటల్ను నిర్మించనున్నారు. జాతీయ రహదారి-216లో ఒంగోలు నుంచి చీరాలకు వెళ్లే మార్గంలో ఇది ఉంటుంది. నేషనల్ హైవే 216 తూర్పు గోదావరి జిల్లాలోని కత్తిపూడి నుంచి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు వరకు ఉంది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల మీదుగా సముద్ర తీరం వెంబడి 456 కిలోమీటర్లు ఇది ఉంది.
