ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. జిల్లాలోని రాంబిల్లి మండలం పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత భూమి కంపించింది. దీంతో నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
వివరాల్లోకి వెళ్తే, శుక్రవారం తెల్లవారుజామున సుమారు 12:30 గంటల సమయంలో ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 3.7గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) అధికారికంగా ధ్రువీకరించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో స్థానికులలో కొందరు భయాందోళనలకు గురయ్యారు.
అయితే, ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి నష్టం గానీ, ప్రాణ నష్టం గానీ జరిగినట్లు ఇప్పటివరకు ఎటువంటి నివేదికలు అందలేదు. భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అర్ధరాత్రి వేళ ఆకస్మికంగా భూమి కంపించడంతో తీరప్రాంత గ్రామాలలో కాస్త ఆందోళన వాతావరణం నెలకొంది.
