Annamayya District : అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలం మఠంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ – తుఫాన్ వాహనం ఒకదాన్నొకటి ఢీకొనడంతో ఐదుగురు చనిపోగా, 11 మందికి గాయాలయ్యాయి. మృతులను కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి వాసులుగా గుర్తించారు. వీరంతా తుఫాన్ వాహనంలో తిరుమలకు వెళ్లి తిరిగి వస్తుండగా తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని సమాచారం. ఈ ప్రమాదం జరిగిన సమయంలో తుఫాన్ వాహనంలో మొత్తం 16 మంది ప్రయాణిస్తున్నారు. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.