Site icon HashtagU Telugu

Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

Chandrababu

Chandrababu

చంద్రబాబు సహా 16 మందిపై జగన్ ప్రభుత్వ హయాంలో నమోదైన ఫైబర్‌నెట్ కేసును సీఐడీ ముగించింది. ఎలాంటి ఆర్థిక అక్రమాలు జరగలేదని, సంస్థకు నష్టం వాటిల్లలేదని నివేదికలో తేల్చింది. గతంలో ఫిర్యాదు చేసిన మాజీ ఎండీ కూడా దీనితో ఏకీభవించారు.. ఏసీబీ కోర్టుకు కూడా హాజరయ్యారు. అయితే ఈ ఫైబర్ నెట్ కేసును మూసివేయడాన్ని వైఎస్సార్‌సీపీ తప్పుబట్టింది. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఘాటుగా విమర్శించింది.

జగన్‌ హయాంలో చంద్రబాబు సహా 16 మందిపై సీఐడీ కేసులు పెట్టింది. తాజాగా ఆ కేసును ముగించారు.. ఫైబర్‌నెట్‌లో అక్రమాలేవీ జరగలేదని.. ఫైబర్ నెట్‌ సంస్థకు ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని సీఐడీ నివేదిక అందజేసింది. గత ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌‌గా ఉన్న ఎం. మధుసూదన రెడ్డి, ప్రస్తుత మేనేజింగ్‌ డైరెక్టర్‌ గీతాంజలి శర్మ ఈ నివేదికతో తాము పూర్తిగా ఏకీభవిస్తున్నామని తెలిపారు. వీరిద్దరు బుధవారం ఏసీబీ కోర్టుకు హాజరై లిఖిత పూర్వకంగా ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో ఫైబర్ నెట్ కేసును మూసేస్తున్నట్లు రాతపూర్వకంగానూ, మౌఖికంగానూ తెలిపారు.

2014-2019 టీడీపీ ప్రభుత్వ హయాంలో.. టెర్రాసాఫ్ట్‌ సంస్థకు ఆయాచిత లబ్ధి చేకూర్చారంటూ ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వ హయంలో ఫైబర్‌నెట్‌ ఎండీగా ఉన్న ఎం.మధుసూదన రెడ్డి 2021 సెప్టెంబరు 11న సీఐడీకి ఫిర్యాదు చేశారు. టెర్రాసాఫ్ట్‌ సంస్థకు రూ.321 కోట్ల లబ్ధిని చేకూర్చారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. 2023లో అక్టోబర్ 11న చంద్రబాబు పేరును కూడా ఈ కేసులో చేర్చారు. ఆ సమయంలో చంద్రబాబుపై గత ప్రభుత్వం వరుసగా కేసులు పెట్టింది.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు జైలుకు కూడా వెళ్లారు. ఆ సమయంలోనే ఈ కేసు కూడా నమోదైంది. కేంద్రం భారత్‌ నెట్‌ పథకం కింద కేంద్రం రూ.3840 కోట్లు విడుదల చేయగా.. అందులో రూ.321 కోట్లు టెర్రాసాఫ్ట్‌కు బదలాయించినట్లు ఆరోపణలు వచ్చాయి.

అయితే ఈ రూ.321 కోట్లు టెర్రాసాఫ్ట్‌కు బదలాయించినట్లు సీఐడీ నిర్ధారించలేకపోయింది. దీంతో ఫైబర్‌నెట్‌ కేసులో ఎలాంటి ఆర్థిక అక్రమాలు జరగలేదని సీఐడీ ధ్రువీకరించింది. గత ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ ఎండీగా పనిచేసిన మధుసూదన రెడ్డే ఇప్పుడు ఈ ఫైబర్ నెట్ కేసును క్లోజ్‌ చేసేందుకు అభ్యంతరం లేదని చెప్పారు. అక్రమాలు జరగలేదన్న సీఐడీ నివేదికతో పూర్తిగా ఏకీభవించారు. దీంతో ఈ కేసు క్లోజ్ చేసినట్లైంది. ఇదిలా ఉంటే చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసును క్లోజ్ చేయడాన్ని వైఎస్సార్‌సీపీ తప్పుబట్టింది.

చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగం చేస్తున్నారని గత ప్రభుత్వ హయాంలో ఏఐజీగా పనిచేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి విమర్శించారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని అవినీతి కేసులను మాఫీ చేసుకుంటున్నారని.. ఈ కేసుల ఉపసంహరణ మీద వైఎస్సార్ సీపీ న్యాయపోరాటం చేస్తుందన్నారు. చంద్రబాబు చేస్తున్న రాజ్యాంగ విరుద్ద చర్యలపై గట్టిగా పోరాడతామన్నారు. చంద్రబాబుపై ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అసైన్డ్ ల్యాండ్ కేసులు కూడా ఉన్నాయన్నారు. చంద్రబాబుకు మంచి పాలన చేయమని ప్రజలు అధికారం ఇచ్చారని.. అంతేగానీ సొంత కేసులను మాఫీ చేసుకోవడానికి కాదన్నారు.

Exit mobile version