AP Rains : గుంటూరులో భారీ వ‌ర్షం..నీట‌మునిగిన పంట పొలాలు

గుంటూరు : జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. వరి, మిర్చి, పత్తి, ఉద్యానవన పంటలు దెబ్బ‌తిన్నాయ‌ని రైతులు ఆందోళన చెందుతున్నారు.

  • Written By:
  • Publish Date - November 29, 2021 / 10:58 AM IST

గుంటూరు : జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. వరి, మిర్చి, పత్తి, ఉద్యానవన పంటలు దెబ్బ‌తిన్నాయ‌ని రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో దాదాపు 65 వేల హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. గుంటూరు జిల్లాలోని తెనాలి రెవెన్యూ డివిజన్‌లోని కొల్లూరు, కొల్లిపర, భట్టిప్రోలు, బాపట్ల, తెనాలి, వేమూరు, రేపల్లె మండలాల్లో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా దాదాపు 60 వేల హెక్టార్లలో వరి పంట దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

వర్షపు నీరు పంట పొలాల్లో నిలిచిపోవడంతో నేలకొరిగిన వరి పొలాలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే బాపట్ల, కాకమాను మండలాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో ప‌డిపోయిన వ‌రిపోలాల్లో ధాన్యం రంగుమారిపోయాయి. అదేవిధంగా జిల్లాలో ఇప్పటికే 3 వేల హెక్టార్లలో మిర్చి, వరి పంటలు నీట మునిగాయి. వర్షాల వల్ల జరిగిన నష్టాల లెక్కలు పంపాలని మండల స్థాయి అధికారులను వ్యవసాయ శాఖ జిల్లా అధికారులు ఆదేశించారు.

కొల్లూరులో మూడెకరాల్లో వరి సాగు చేసి.. ఇప్పటికే కురిసిన వర్షాలకు వరిపంటలు దెబ్బతిన్నాయని ఓ రైతు త‌న ఆవేద‌నను వ్య‌క్తం చేశాడు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరిపంటలు మరింత దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు. రంగు మారిన వరిపంటకు తక్కువ ధర ఉంటుంద‌ని ఇటు వ్యాపారులు అంటున్నారు. మరో రైతు అమరావతికి చెందిన మ‌రో రైతు కూడా ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఇటీవల కురిసిన వర్షాలకు మిర్చి తోటలు దెబ్బతినగా, గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు మిర్చి తోటలు మరింత దెబ్బతిన్నాయని, దీంతో మరింత నష్టపోతామని చెప్పారు. జిల్లాలోని తెనాలి రెవెన్యూ డివిజన్‌లోని వరి పొలాలు, మిర్చి తోటలు, కూరగాయల తోటలు దెబ్బతినే అవకాశం ఉందని, వివిధ పంటలపై వర్షాల ప్రభావంపై నివేదిక పంపాలని అధికారులను ఆదేశించిన‌ట్లు వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ఎం.విజయభారతి తెలిపారు.