ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, శస్త్రచికిత్స అనంతరం పూర్తిస్థాయిలో కోలుకున్నాక తొలిసారిగా మంగళవారం బయటకు వచ్చారు. ఇటీవల దివంగతులైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావుకు ఆయన నివాళులర్పించారు. హైదరాబాద్లోని నాదెండ్ల నివాసానికి వెళ్లిన పవన్, భాస్కరరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
గత నెల 22న నాదెండ్ల భాస్కరరావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పవన్ కల్యాణ్ సైనస్ సమస్యకు శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ఆయన అంత్యక్రియలకు హాజరుకాలేకపోయారు. అయితే, వార్త తెలిసిన వెంటనే భాస్కరరావు కుమారుడు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కు ఫోన్లో పరామర్శించారు.
తాజాగా ఆరోగ్యం కుదుటపడటంతో వైద్యుల సూచన మేరకు మంగళవారం ఆయన నేరుగా సహచర మంత్రి నాదెండ్ల మనోహర్ను, ఆయన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు. చాలా రోజుల తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ సాధారణ స్థితిలో కనిపించడంతో జనసేన కార్యకర్తలు, ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
