Super Cops : బాలుడు కిడ్నాప్‌..3గంట‌ల్లో చేధించిన పోలీసులు

బాలుడి కిడ్నాప్ జ‌రిగిన మూడు గంట‌ల్లోనే కేసును కృష్ణాజిల్లా పోలీసులు చేధించారు. ఘటన జరిగిన మూడు గంటల్లోనే కిడ్నాపర్ బారి నుంచి చిన్నారిని అవనిగడ్డ పోలీసులు రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు.

  • Written By:
  • Publish Date - November 23, 2021 / 11:52 AM IST

బాలుడి కిడ్నాప్ జ‌రిగిన మూడు గంట‌ల్లోనే కేసును కృష్ణాజిల్లా పోలీసులు చేధించారు. ఘటన జరిగిన మూడు గంటల్లోనే కిడ్నాపర్ బారి నుంచి చిన్నారిని అవనిగడ్డ పోలీసులు రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. అవనిగడ్డ పోలీసులు పెద్దఎత్తున సోదాలు నిర్వహించి మొబైల్ కాల్ డేటా సహాయంతో నిందితుడిని పట్టుకున్నారు. బాడుడిని వ‌దిలిపెట్టేందుకు కిడ్నాపర్ ల‌క్ష రూపాయ‌లు డిమాండ్ చేశాడు. అవనిగడ్డలోని ఓ ఇంటి నుంచి చిన్నారిని పోలీసులు రక్షించారు. భయాందోళనకు గురైన తల్లిదండ్రులు తమ బిడ్డను తిరిగి పొందడంతో ఊపిరి పీల్చుకున్నారు. కృష్ణా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సిద్ధార్థ్ కౌశల్ సోమవారం మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. ఏడేళ్ల బాలుడు ముహిజానాథ్‌ను స్థానిక యువకుడు హేమంత్ కిడ్నాప్ చేశాడ‌ని..వ‌దిలిపెట్టేంద‌కు పెద్ద మొత్తంలో డ‌బ్బులు డిమాండ్ చేశాడని తెలిపారు . చిన్నారి తండ్రి ఆర్ రత్నగిరి నాగాయలంకలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో భాషా పండిట్‌గా పనిచేస్తున్నాడు.

కిడ్నాపర్ హేమంత్ చిన్నారిని అపహరించి డ‌బ్బులు డిమాండ్ చేయాల‌ని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం చిన్నారిని కిడ్నాప్ చేసి అవనిగడ్డలోని నిర్మానుష్య ప్రాంతంలో ఓ గదిలో బస చేశాడు. ఘటన గురించి తెలుసుకున్న ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ చిన్నారిని రక్షించేందుకు 20 బృందాలను ఏర్పాటు చేశారు. అవనిగడ్డ, పరిసర ప్రాంతాల్లోని ముఖ్యమైన జంక్షన్లలో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. పోలీసు బృందాలు చెక్‌పోస్టులు, ఇతర అనుమానిత ప్రదేశాల్లో అన్ని వాహనాలను తనిఖీ చేశారు.
మరోవైపు కిడ్నాపర్ హేమంత్ తండ్రి రత్నగిరిని సంప్రదించడానికి వేర్వేరు మొబైల్ నంబర్‌లను ఉపయోగించాడు. కిడ్నాపర్ ఉపయోగించిన కాల్ డేటా, మొబైల్ నంబర్, సీసీ కెమెరా ఫుటేజీల సహాయంతో పోలీసులు కిడ్నాపర్‌ని గుర్తించి చిన్నారిని రక్షించారు.

అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్‌బాషా, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, కానిస్టేబుళ్లు తదితరులు చిన్నారిని వెతికి రక్షించే కార్యక్రమంలో పాల్గొన్నారు. నిందితుడు హేమంత్ నాగాయలంక మండలం మర్రిపాలెం గ్రామానికి చెందినవాడని ఎస్పీ తెలిపారు. నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాప్ జరిగిన మూడు గంటల్లోనే చిన్నారిని రక్షించినందుకు తల్లిదండ్రులు ఎస్పీకి, ఇతర పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.