BYJU’S MoU With AP Govt: విద్యా రంగంలో జ‌గ‌న్ విప్ల‌వాత్మ‌క సంస్క‌ర‌ణ‌..!

ఏపీ స‌ర్కార్ మరో కీలక అడుగువేసింది. నాడు–నేడు, ఇంగ్లిషుమీడియం, ద్విభాషలతో కూడిన పాఠ్యపుస్తకాలు, విద్యాకానుక, అమ్మ ఒడి, గోరుముద్దలాంటి కార్యక్రమాలతో విద్యారంగంలో చరిత్ర సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది

  • Written By:
  • Updated On - June 16, 2022 / 05:29 PM IST

ఏపీ స‌ర్కార్ మరో కీలక అడుగువేసింది. నాడు–నేడు, ఇంగ్లిషు మీడియం, ద్వి భాషలతో కూడిన పాఠ్యపుస్తకాలు, విద్యాకానుక, అమ్మ ఒడి, గోరుముద్ద లాంటి కార్యక్రమాలతో విద్యారంగంలో చరిత్ర సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయంగా ఖ్యాతి చెందిన అతిపెద్ద ఎడ్యుకేషనల్‌ టెక్‌ కంపెనీ ‘బైజూస్‌’తో ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం సమక్షంలో కమిషనర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఎస్‌. సురేష్‌ కుమార్, బైజూస్‌ వైస్‌ ప్రెశిడెంట్‌ మరియు పబ్లిక్‌పాలసీ హెడ్‌ సుస్మిత్‌ సర్కార్‌ సంతకాలు చేశారు. వర్చువల్‌ పద్ధతిలో ‘బైజూస్‌’ వ్యవస్థాపకుడు, సీఈఓ రవీంద్రన్‌ అమెరికా నుంచి పాల్గొన్నారు.

రాష్ట్రంలో విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించడంపై ముఖ్యమంత్రి శ్రీ వై. యస్‌. జగన్‌ ప్రత్యేక దృష్టిపెట్టారు. దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సందర్భంగా వివిధ యూనికార్న్‌ కంపెనీల వ్యవస్థాపకులు, సీఈఓలు, కీలక అధికారులతో సీఎం సమావేశమయ్యారు. అక్కడే బైజూస్‌ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌ తో సీఎం సమావేశమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా నేర్చుకునేలా ఇ– లెర్నింగ్ కార్యక్రమంపై నిశితంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ రవీంద్రన్‌ చెప్పారు. ఈ చర్చల ఫలితంగా.. ఇవాళ బైజూస్‌ తో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ (MoU) కుదుర్చుకుంది. ఇప్పటివరకూ కొందరికే పరిమితమైన ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ విద్య ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలకు కూడా అందుబాటులోకి రానుంది. ఏడాదికి కనీసం రూ. 20 వేల నుంచి రూ. 24 వేలు చెల్లిస్తే కాని ‘బైజూస్‌’ ఇ– తరగతులు విద్యార్థులకు అందుబాలోకి రావు. అలాంటి నాణ్యమైన విద్య ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. పేదరికం అన్నది నాణ్యమైన చదువులకు అడ్డంకాకూడదనే సంకల్పంతో వై. యస్‌. జగన్‌ సర్కార్‌ ఈ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

రాష్ట్ర ప్రభుత్వంతో బైజూస్‌ భాగస్వామ్యం కావడం చాలా సంతోషకరమ‌ని.. పేదపిల్లల జీవితాలను ఇది మారుస్తుంద‌ని సీఎం జ‌గ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ ప్రక్రియలో బైజూస్‌ భాగస్వామ్యం కావడం అన్నది చాలా గొప్ప ఆలోచనని.. మంచి చదువులను నేర్చుకునే విషయంలో పిల్లలను ముందుండి నడిపించడం అన్నది ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన ఉద్దేశమ‌ని అన్నారు. పదో తరగతి లో ఆంగ్లమాధ్యమంలో సీబీఎస్‌ఈ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు. 4 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అందుబాటులోకి వస్తుందని.. విద్యారంగంలో ఇదొక మేలిమలుపు, ఇది ఒక గేమ్‌ ఛేంజర్ గా చూడాల‌ని జ‌గ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు.
2025లో సీబీఎస్‌ఈ నమూనాలో పరీక్షలు రాయనున్న ప్రస్తుత 8వ తరగతి విద్యార్థులను సుశిక్షితులు చేసేందుకు ఇంకొన్ని అడుగులు వేస్తున్నామన్నారు సీఎం జ‌గ‌న్‌. ఈ విద్యార్థులకు, సిలబస్‌తోపాటు అదనంగా ఇంగ్లిషు లెర్నింగ్‌ యాప్, నేర్చుకునేందుకు ట్యాబ్‌లు ఇస్తామన్న ముఖ్యమంత్రి తెలిపారు. దాదాపు 4.7 లక్షల మందికి ట్యాబ్‌లు ఇచ్చేందుకు రూ. 500 కోట్లు ఖర్చు చేయ‌నున్న‌ట్లు చెప్పారు. ఈ సెప్టెంబరులోనే ట్యాబ్‌లు ఇస్తామన్న సీఎం ప్రతి ఏటా 8 వరగతిలోకి వచ్చే విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి బైజూస్‌ కంటెంట్‌ను పొందుపరిచి పాఠ్యపుస్తకాలను ముద్రిస్తామని చెప్పారు.

ముఖ్యమంత్రి గారి వేగం అనూహ్యమైనదని ఆయన వేగంగా స్పందించిన తీరు మా అందరికీ కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఎంఓయూ సందర్భంగా బైజూస్‌ రవీంద్రన్ అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రైవేటు స్కూళ్లలో, ఇతరులు అందుబాటులో ఉంటే అదే కంటెంట్‌ను ఎలాంటి వ్యత్యాసం లేకుండా ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులకూ అందుబాటులోకి తీసుకురానున‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇది చాలా గొప్ప ముందడుగని అన్నారు.

బైజూస్‌తో అవగాహన ఒప్పందం– ముఖ్యాంశాలు
– ప్రభుత్వం స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి వరకూ విద్యను అభ్యసిస్తున్న పిల్లల సంఖ్య దాదాపుగా 32 లక్షల మంది ఉన్నారు.
– బైజూస్‌ తో ప్రభుత్వం ఒప్పందం కారణంగా వీరందరికీ లెర్నింగ్‌ యాప్‌ ద్వారా నాణ్యమైన విద్య అందుతుంది.
– 2025 నాటి పదో తరగతి విద్యార్థులు, అంటే ఇప్పటి 8వ తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ నమూనాలో పరీక్షలు రాస్తారు. వీరిని సన్నద్ధంచేసేందకు వీలుగా ఈ యాప్‌ తోపాటు అదనంగా ఇంగ్లిషు లెర్నింగ్‌ యాప్‌ కూడా ఉచితంగా అందుబాటులోకి వస్తోంది. నేర్చుకోవడానికి వీరికి ట్యాబ్‌ కూడా సమకూర్చనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని 4.7 లక్షల మంది విద్యార్థులు దీనివల్ల లబ్ధి పొందనున్నారు.
– బైజూస్‌ లో లెర్నింగ్‌ యాప్‌ లో బోధన అంతా అత్యంత నాణ్యంగా ఉంటుంది. యానిమేషన్‌ ద్వారా, బొమ్మల ద్వారా విద్యార్థులకు మరింత సులభంగా, క్షుణ్నంగా, సమగ్రంగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది.
– మ్యాథ్స్, సైన్స్, సోషల్‌ స్టడీస్‌ ఈ సబ్జెక్టులన్నీ కూడా ఇటు ఇంగ్లిషులోనూ, ఇటు తెలుగు మాధ్యంలోనూ అందుబాటులో ఉంటాయి. ద్వి భాషల్లో పాఠ్యాంశాలు ఉండడం వల్ల పిల్లలు సులభంగా నేర్చుకునేందుకు, భాషాపరమైన ఆటంకాలు లేకుండా విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
– వినూత్న, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంలో వీడియో పాఠ్యాంశాలు అత్యంత స్పష్టతతో, నాణ్యతతో ఉంటాయి.
– విద్యార్థులు ఎంతవరకూ నేర్చకున్నారన్నదానిపై ప్రతి ఒక్కరికీ కూడా ఫీడ్‌ బ్యాక్‌ పంపుతారు. ఇది పిల్లలకు ఎంతో ఉపయోగం.
– సీబీఎస్‌ఈ సిలబస్‌ ఆధారంగా మ్యాపింగ్‌ చేస్తూ యాప్‌ లో పాఠ్యాంశాలకు రూపకల్పన చేశారు. సీబీఎస్‌ఈ పాఠ్యప్రణాళికను అనుసరించి ప్రతి సబ్జెక్టులోని ప్రతి అధ్యాయంలో కూడా వివిధ అంశాలపై ప్రశ్నావళి ఉంటుంది.
– 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గణితం, సామాన్య శాస్త్రం సులభంగా అర్ధం చేసుకునేందుకు వీలుగా ఇంటరాక్టివ్‌ గేమ్స్‌ కూడా యాప్‌ లో ఉంటాయి. ఏ తరహా పరిజ్ఞానం ఉన్న విద్యార్థి అయినా యాప్‌ ద్వారా సులభంగా పాఠాలు నేర్చుకోవచ్చు.
– పునశ్చరణ చేసుకునేలా, నేర్చుకున్న విషయ పరిజ్ఞానాన్ని అంచనావేసేందుకు, అభ్యాశనం కోసం వెనువెంటనే ప్రశ్నలు, వీడియోలు, గేమ్స్, సిమ్ములేషన్స్‌.. ఇవన్నీ కూడా యాప్‌ లో పొందుపరిచారు.
– 6 నుంచి 8వ తరగతి వరకూ మ్యాథ్స్‌ లో ఆటో సాల్వర్‌, స్కాన్‌ క్వశ్చన్స్‌ (లైవ్‌ చాట్‌ పద్ధతిలో ద్వారా నేరుగా…), స్టెప్‌ బై స్టెప్‌ సొల్యూషన్స్‌… ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న బైజూస్‌ యాప్‌ ద్వారా లభిస్తాయి.
– తరచుగా సాధన చేయడానికి వీలుగా, మాదిరి ప్రశ్న పత్రాలు కూడా విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి.
– విద్యార్థి నేర్చుకున్న ప్రగతిపై నెలవారీగా ప్రోగ్రెస్‌ రిపోర్టులు కూడా ఇస్తారు. ఆన్లైలో ఉపాధ్యాయుడి తో మీటింగ్‌ కూడా ఉంటుంది