ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (శనివారం) ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను పరామర్శించనున్నారు. ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకునేందుకు చంద్రబాబు హైదరాబాద్ వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్లోని పవన్ నివాసానికి సీఎం వెళ్తారని సమాచారం.
గత నెలలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం ఆయన ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆపరేషన్ తర్వాత పది రోజుల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో, పవన్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్లోని తన నివాసానికే పరిమితమయ్యారు.
ఇదిలావుంచితే, ఇటీవల కన్నుమూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రీజెన్సీ సెరామిక్స్ అధినేత జీఎన్ నాయుడు కుటుంబాన్ని కూడా చంద్రబాబు పరామర్శించనున్నారు. నందగిరి హిల్స్లోని వారి నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయనున్నారు.
