Posani Krishna Murali: సినీనటుడు పోసాని కృష్ణ మురళికి మరో షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటికే ఆయనపై పలు చోట్ల ఫిర్యాదులు నమోదవుతున్నాయి. తాజాగా, పోసాని కృష్ణ మురళిపై సీఐడీ కీసు నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్ తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదును బట్టి, ఏపీ సీఐడీ అధికారులు పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేశారు.
సెప్టెంబర్ నెలలో జరిగిన ఓ మీడియా సమావేశంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కించపరిచేలా పోసాని కృష్ణ మురళి ప్రసార మాధ్యమాల్లో మాట్లాడారని బండారు వంశీకృష్ణ ఫిర్యాదులో పేర్కొన్నారు.
చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరిచిన పోసాని పై కేసు:
వంశీకృష్ణ, పోసాని కృష్ణ మురళి తన వ్యాఖ్యల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబును కించపరిచారన్న ఆరోపణ చేశారు. ఆయన మాటలు వర్గాల మధ్య విభేదాలను రెచ్చగొడతాయినీ, సమాజంలో ఉద్రిక్తతలను పెంచేలా ఉండాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా, సీఐడీ అధికారులు పోసాని కృష్ణ మురళిపై వివిధ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. 111, 196, 353, 299, 336 (3) (4), 341, 61(2) బీఎస్ఎస్ సెక్షన్లు కింద పోసాని పై చర్యలు తీసుకోవడానికి సీఐడీ కేసు నమోదు చేసింది.
పోసాని పై మరో కేసు:
మరోవైపు, పోసాని కృష్ణ మురళి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఇప్పటికే అనేక పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదు అయ్యాయి. పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేష్ గురించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కడప జిల్లా రిమ్స్ పోలీస్ స్టేషన్లో బీసీ సెల్ ఉపాధ్యక్షుడు వెంకట సుబ్బయ్య ఫిర్యాదు చేశారు.
పోసాని పై మరిన్ని ఫిర్యాదులు:
అలాగే, రాజంపేట పోలీస్ స్టేషన్కు కూడా పోసాని కృష్ణ మురళి పై ఫిర్యాదు అందింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఫిర్యాదులు నమోదయ్యాయి. పోసానిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. అంతేకాక, అనంతపురం, బాపట్ల, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిత్తూరు, తిరుపతి, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ పోసాని కృష్ణ మురళి పై ఫిర్యాదులు వచ్చాయి.
మరోవైపు, సినీ నటి శ్రీరెడ్డి కూడా వివాదంలో చిక్కుకున్నారు. ఆమె సోషల్ మీడియా ఖాతాల ద్వారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వంగలపూడి అనితల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని, దీనిపై కూడా కూటమి శ్రేణులు వివిధ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.