తెలుగు జాతి ప్రపంచలో నెం. 1 గా ఉండాలని, ఆ సంకల్పంతో పని చేస్తానని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…..వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ప్రజా సేవకు అంకితమయ్యానని.. వెంకటేశ్వర స్వామి తమ ఇంటి దైవమని ఆయన తెలిపారు. ఏ పనైనా ఆయన్ను తలచుకునే ప్రారంభిస్తానని.. 2003 శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో అలిపిరిలో తనపై దాడి జరిగినపుడు తనకు ఆ వెంకటేశ్వర స్వామి ప్రాణ భిక్ష పెట్టారన్నారు. మొన్న తనకు కష్టం వచ్చినపుడు కూడా వెంకటేశ్వరస్వామికి మొక్కుకున్నానని.. మొదటగా ఆయన దర్శనం చేసుకున్న తర్వాతే మిగతా కార్యక్రమాలు చేపట్టాలి అని అనుకున్నానని చంద్రబాబు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
భారతదేశం ప్రపంచంలో అగ్రస్ధానంలో ఉండాలనేది, అందులో తెలుగుజాతి నెం – 1 గా ఉండాలనేది తన ఆకాంక్షని చంద్రబాబు తెలిపారు. ప్రపంచంలోనే అత్యున్నత నాగరికత భారత దేశం సొంతమని.. అందులో తెలుగుజాతి ప్రత్యేకమన్నారు. తెలుగు జాతి అగ్రస్ధానంలో ఉండాలని స్వామిని కోరుకున్నానని.. తెలుగు జాతిని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లాలనే తన సంకల్పానికి శక్తిని ప్రసాదించమని దేవున్ని ప్రార్దించానని చంద్రబాబు తెలిపారు.తన కష్ట సమయంలో తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలలోని తెలుగు ప్రజలు మద్దతుగా నిలిచారని.. వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడుని చూసి ఓ మహిళ ఉద్వేగానికి గురయ్యింది. చంద్రబాబు ఆమెను దగ్గర కు తీసుకుని మాట్లాడారు. వాహనం దగ్గరకు వెళ్తున్న చంద్రబాబును చూసేందుకు అక్కడ ఉన్న భక్తులు ఉత్సాహం చూపారు. చంద్రబాబు అందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు. కాన్వాయ్ వెళుతున్న మార్గంలో పెద్ద ఎత్తున గుమికూడిన భక్తులు, ప్రజలు చంద్రబాబు కు అభివాదం చేశారు.
Also Read: KTR: పోలింగ్ పూర్తి కాకుండా ఎగ్జిట్ ఫలితాలా? అవన్నీ చెత్త ఫలితాలు: కేటీఆర్