AP Capital : జగన్ ను ఊసరవెల్లితో పోల్చిన చంద్రబాబు

హైదరాబాద్‌తో పోటీపడి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచేలా అమరావతిని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇకపై రాజకీయ మార్పులు వచ్చినా రాజధాని విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా

Published By: HashtagU Telugu Desk
Cbn Jagan

Cbn Jagan

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక తీర్మానంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. తెలుగువారు దశాబ్దాలుగా రాజధానులను కోల్పోతూ, వివక్షకు గురవుతూ వస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణ-గోదావరి నదుల మధ్య ఉన్న అమరావతి ప్రాంతానికి శాతవాహనుల కాలం నాటి ఘన చరిత్ర ఉందని, బ్రిటీష్ మ్యూజియంలో సైతం దీనికి ప్రత్యేక గ్యాలరీ ఉండటమే దీని ప్రాచీనతకు నిదర్శనమని గుర్తు చేశారు. 200 ఏళ్ల పాటు మద్రాస్ ప్రెసిడెన్సీలో మన గుర్తింపు కోల్పోయామని, ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాకే ‘మద్రాసీలు’ అనే ముద్ర పోయి ‘ఆంధ్రులు’ అనే గౌరవం దక్కిందని ఆయన పేర్కొన్నారు.

జగన్ తీరుపై ధ్వజమెత్తిన సీఎం

రాజధాని విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరించిన వైఖరిని చంద్రబాబు ‘ఊసరవెల్లి రాజకీయాలు’గా అభివర్ణించారు. 2014లో విభజన సమయంలో సమన్యాయం చేయాలని తాను పోరాడుతుంటే, నాటి వైసీపీ నాయకులు పార్లమెంటులో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని విమర్శించారు. తొలినాళ్లలో అమరావతికి బేషరతుగా మద్దతు తెలిపిన జగన్, అధికారం దక్కగానే మూడు రాజధానుల పేరుతో విషం చిమ్మారని మండిపడ్డారు. ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని, అమరావతిపై కుట్రలు చేసి నిర్మాణాలను నిలిపివేసిన వైసీపీ.. ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన పార్టీగా చరిత్రలో నిలిచిపోతుందని చంద్రబాబు ఘాటుగా విమర్శించారు.

అమరావతికి తిరుగులేని చట్టబద్ధత – భవిష్యత్ తరాలకు భరోసా!

రాజధానిని కేవలం ఒక నగరంలా కాకుండా, ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోందని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్‌తో పోటీపడి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచేలా అమరావతిని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇకపై రాజకీయ మార్పులు వచ్చినా రాజధాని విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే ఈ చట్టబద్ధత తీర్మానాన్ని కేంద్రానికి పంపుతున్నట్లు వివరించారు. ఈ ప్రక్రియ పూర్తయితే అమరావతి స్థిరత్వంపై సామాన్యులకు, పెట్టుబడిదారులకు పూర్తి నమ్మకం కలుగుతుందని, ఇది కేవలం ఒక పార్టీ నిర్ణయం కాదని, రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్న చారిత్రక నిర్ణయమని ఆయన పునరుద్ఘాటించారు.

  Last Updated: 28 Mar 2026, 08:14 PM IST