Site icon HashtagU Telugu

TTD Chairman: టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు ప్రమాణస్వీకారం

Ttd Chairman Br Naidu Swearing Ceremony

Ttd Chairman Br Naidu Swearing Ceremony

TTD Chairman: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కొత్త పాలకమండలి ఛైర్మన్‌గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు (BR Naidu) బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా 17 మంది టీటీడీ సభ్యులు కూడా ప్రమాణం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద ఈవో శ్యామలరావు బీఆర్ నాయుడు చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

కొత్త టీటీడీ పాలకమండలి ఛైర్మన్‌ బీఆర్ నాయుడు, 17 మంది సభ్యులతో కలిసి శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో తమ బాధ్యతలు స్వీకరించారు. ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా ఎండోమెంట్‌ కమిషనర్‌ సత్యనారాయణ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మొదటగా చైర్మన్‌ బీఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు, తర్వాత సభ్యులు ప్రమాణ పత్రాలపై సంతకాలు చేసారు.

ఆ తర్వాత, కొత్త పాలకమండలి సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. తరువాత, రంగనాయకుల మండపంలో వారికి శేషవస్త్రాలు కప్పి వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం అన్నమయ్య భవనంలో కొత్త పాలకమండలి మీడియాతో సమావేశమవుతుంది.

కొత్త టీటీడీ బోర్డులో సభ్యులు వీరే:

నూతన టీటీడీ పాలకమండలిలో టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు సభ్యులుగా నియమితులయ్యారు.

టీడీపీ సభ్యులుగా:
– జ్యోతుల నెహ్రు (జగ్గంపేట)
– వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (కోవూరు)
– ఎంఎస్ రాజు (మడకశిర)
– మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మీ
– రాజమహేంద్రవరం సమీపంలోని రఘుదేవపురం ప్రాంతానికి చెందిన అక్కిన మునికోటేశ్వరరావు
– నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్
– పల్నాడు జిల్లా జంగా కృష్ణమూర్తి
– కుప్పం క్లస్టర్ ఇన్‌చార్జి వైద్యం శాంతారాం
– మంగళగిరి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి (తెలంగాణ)

జనసేన నుంచి:
– పవన్ కళ్యాణ్ సన్నిహితుడు, తెలంగాణ జనసేన ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్ రెడ్డి
– సినీ ఆర్ట్ డైరెక్టర్, పవన్ కళ్యాణ్ స్నేహితుడు బూరగాపు ఆనంద్ సాయి
– జనసేన పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు అనుగోలు రంగశ్రీ

అలాగే బీజేపీ నుంచి:
– కేంద్రమంత్రి అమిత్‌షా సన్నిహితుడు కృష్ణమూర్తి వైద్యనాథన్
– ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశరెడ్డి

ఫార్మా రంగంలో:
– నాట్కో గ్రూప్ వైస్ చైర్మన్ సన్నపనేని సదాశివరావు
– ఎన్‌ఆర్‌ఐ జాస్తి పూర్ణసాంబశివరావు

ఇతర ప్రముఖులు:
– భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎండీ సుచిత్ర ఎల్లా
– తమిళనాడుకు చెందిన రామ్మూర్తి
– కర్ణాటక పారిశ్రామికవేత్తలు నరేశ్ కుమార్
– గుజరాత్‌కు చెందిన ఎంసీఐ చైర్మన్ కేతన్ దేశాయ్ కుమారుడు అదిత్ దేశాయ్
– మహారాష్ట్ర ఆర్థిక నిపుణుడు సౌరభ్ బోరా
– కాఫీ రంగంలో ప్రముఖుడు ఆర్‌.ఎన్. దర్శన్
– సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి హెచ్‌.ఎల్. దత్

టీటీడీలో వారికీ మళ్ళి అవకాశం దక్కింది:

తాజా టీటీడీ పాలకమండలిలో సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో కొందరు గతంలో కూడా బోర్డులో ఉన్న వారే. వారిలో కృష్ణమూర్తి వైద్యనాథన్‌, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, సౌరభ్ బోరా, సుచిత్ర ఎల్లా ఉన్నారు.

గత వైసీపీ ప్రభుత్వంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జంగా కృష్ణమూర్తి టీటీడీ బోర్డులో సభ్యులుగా కొనసాగారు. మహారాష్ట్రకు చెందిన సౌరభ్ బోరా కూడా చివరి రెండు బోర్డుల్లో సభ్యుడిగా కొనసాగారు.

భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎండీ సుచిత్ర ఎల్లా, గత టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన బోర్డులో సభ్యురాలిగా పని చేశారు.

కేంద్ర హోం మంత్రికి సన్నిహితుడిగా పేరుగాంచిన చెన్నైకి చెందిన కృష్ణమూర్తి వైద్యనాథన్‌ 2015 నుంచి ఐదుసార్లు వరుసగా టీటీడీ బోర్డులో సభ్యుడిగా కొనసాగుతున్నారు.

వారసులుగా ఇద్దరు:

తిరుప్పుర్ బాలుగా పేరుగాంచిన బాల సుబ్రమణియన్ పళణిస్వామి గత ప్రభుత్వంలో టీటీడీ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. కానీ ఈసారి ఆయన స్థానాన్ని ఆయన సోదరుడు రామ్మూర్తి దక్కించుకున్నారు.

అలాగే, గత బోర్డులో సభ్యుడిగా ఉన్న కేతన్ దేశాయ్ కుమారుడు, కుసుమ్ ధీరజ్‌లాల్ ఆస్పత్రి ఎండీ అదిత్ దేశాయ్‌కి కూడా ఈసారి బోర్డులో చోటు లభించింది.