బిల్డర్లకు ఏపీ ప్రభుత్వం భారీ ఊరట..100% పన్ను కట్టక్కర్లేదు !!

వాస్తవానికి ఈ పన్ను తగ్గింపు ప్రతిపాదన 2014-19 టీడీపీ హయాంలోనే వచ్చినా, వివిధ కారణాల వల్ల గత ప్రభుత్వం దీనిని పక్కన పెట్టింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీనికి చట్ట సవరణ చేసి పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది

Published By: HashtagU Telugu Desk
Apgovt Goodnews

Apgovt Goodnews

AP government provides huge relief to builders : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్య ప్రజలకు మరియు బిల్డర్లకు భారీ ఊరటనిస్తూ వీఎల్‌టీ (Vacant Land Tax) లో 50 శాతం రాయితీని ప్రకటించింది. ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. భవన నిర్మాణ అనుమతి పొందిన నాటి నుండి నిర్మాణం పూర్తయ్యే వరకు చెల్లించాల్సిన ఈ పన్నును సగానికి తగ్గించడం వల్ల, రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణ రంగంపై ఏటా రూ. 30 కోట్ల మేర ఆర్థిక భారం తగ్గనుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఆదాయం తగ్గినప్పటికీ, రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుంది.

నిర్ణీత కాలపరిమితిలోపు నిర్మాణాలకే రాయితీ

ప్రభుత్వం ప్రకటించిన ఈ 50 శాతం పన్ను రాయితీ అందరికీ వర్తించదు; దీనికి కొన్ని కఠినమైన నిబంధనలను విధించింది. భవన నిర్మాణానికి అనుమతి తీసుకున్న తర్వాత నిర్దేశించిన గడువులోపు పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఐదు అంతస్తుల వరకు ఉంటే మూడేళ్లలోగా, ఐదు అంతస్తుల కంటే ఎక్కువ ఉంటే ఆరేళ్లలోగా నిర్మాణం పూర్తి చేయాలి. ఇలా నిర్ణీత కాలపరిమితిలో పనులు ముగించే భవనాలకు మాత్రమే ఈ వీఎల్‌టీ తగ్గింపు వర్తిస్తుంది. ఒకవేళ ఎవరైనా పన్ను రాయితీ పొంది, నిర్మాణం మధ్యలో నిలిపివేస్తే లేదా గడువు మించితే, ఆ రాయితీ మొత్తాన్ని తిరిగి రికవరీ చేసేలా నిబంధనలు రూపొందించారు.

రియల్ ఎస్టేట్ జోరుకు నాంది

వాస్తవానికి ఈ పన్ను తగ్గింపు ప్రతిపాదన 2014-19 టీడీపీ హయాంలోనే వచ్చినా, వివిధ కారణాల వల్ల గత ప్రభుత్వం దీనిని పక్కన పెట్టింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీనికి చట్ట సవరణ చేసి పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా కార్పొరేషన్లలో 0.5 శాతం, మున్సిపాలిటీల్లో 0.2 శాతం చొప్పున పన్ను వసూలు చేస్తున్నారు. తాజా నిర్ణయంతో ఈ శాతం సగానికి పడిపోనుంది. ఈ మినహాయింపుల వల్ల సొంత ఇల్లు కట్టుకునే సామాన్యుడికి ఆదా అవ్వడమే కాకుండా, అక్రమ లేఅవుట్లకు అడ్డుకట్ట పడి, నిబంధనల ప్రకారం సాగే నిర్మాణాలకు పెద్ద ఎత్తున ఊతం లభిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

  Last Updated: 19 Feb 2026, 11:31 AM IST