AP Cabinet : ఈనెల 28న ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న ఈ కేబినెట్ భేటీలో 2025-26 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్నారు. ఏపీలో ప్రభుత్వం తీసుకురావాలని ప్రయత్నిస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ విధి విధానాలపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. అలాగే శాసన సభ బడ్జెట్ సమావేశాలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. వివిధ పాలనా సంబంధిత అంశాలపై ఈ మంత్రి వర్గ సమావేశంలో చర్చించనున్నారు.
Read Also: BC Census Survey : కులగణనను కాపాడుకోకపోతే బీసీలే నష్టపోతారు : సీఎం రేవంత్ రెడ్డి
ఇక, త్వరలో రాష్ట్రంలో ఈ బడ్జెట్ సమావేశాల నుంచి ప్రారంభించనున్న సంక్షేమ పథకాలపైనా కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ మంత్రివర్గ సమావేశంలోనే మరిన్ని ఇతర కీలక అంశాలపైనా సీఎం, మంత్రులు చర్చించనున్నారు. అయితే ముందుగా అనుకున్న ప్రకారం ఏపీ కేబినెట్ భేటీ ఫిబ్రవరి 20 వ తేదీన చంద్రబాబు అధ్యక్షతన జరగాల్సి ఉంది. అయితే అదే రోజు.. న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి రేఖాగుప్తా ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉండటంతో 28వ తేదీకి వాయిదా పడింది.
మరోవైపు రేపు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు కల్పించ వలసిన భద్రతపై డీజీపీ, ఇతర పోలీస్ అధికారులతో స్పీకర్ సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో సభ్యుల భద్రతతో పాటు అసెంబ్లీ బయట శాంతి భద్రతల పై సమీక్ష నిర్వహించనున్నారు.
Read Also: Indian National Anthem: పాక్ గడ్డపై భారత జాతీయ గీతం.. వీడియో వైరల్!