AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశం.. 2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్

రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా, భారీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు అమరావతి సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో సుమారు రూ.2.01 లక్షల కోట్ల విలువైన 25 పారిశ్రామిక ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేయనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 39,067 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఇప్పటికే 17వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశంలో ఆమోదం […]

Published By: HashtagU Telugu Desk
Chandrababu

Chandrababu

రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా, భారీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు అమరావతి సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో సుమారు రూ.2.01 లక్షల కోట్ల విలువైన 25 పారిశ్రామిక ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేయనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 39,067 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.

ఇప్పటికే 17వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశంలో ఆమోదం పొందిన ఈ ప్రతిపాదనలకు కేబినెట్ తుది ఆమోదం తెలపనుంది. వీటిలో అత్యంత కీలకమైనదిగా విశాఖపట్నంలో రూ.1.08 లక్షల కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ ప్రాజెక్టు ఉంది. ఐటీ, డిజిటల్ మౌలిక వసతుల రంగంలో ఈ ప్రాజెక్టు విశాఖకు మరింత ప్రాధాన్యం చేకూర్చనుంది.

ఇవే కాకుండా, శ్రీ సత్యసాయి జిల్లాలో రూ.51,300 కోట్లతో రిలయన్స్ ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ప్లాంట్, కడప జిల్లాలో రూ.12,297 కోట్లతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు, తిరుపతి జిల్లాలో రూ.2,508 కోట్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ తయారీ యూనిట్, శ్రీసిటీలో రూ.6,100 కోట్లతో అపోలో టైర్స్ యూనిట్ వంటి భారీ ప్రాజెక్టులకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.

అలానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల చేసిన పొదుపు చర్యల సూచనలపైనా కేబినెట్ సమావేశం అనంతరం ప్రత్యేక చర్చ జరగనుంది. ప్రభుత్వ వ్యయ నియంత్రణ చర్యలపై సమీక్షించి తగు సూచనలు చేయనున్నారని సమాచారం. జిల్లా పర్యటనల సమయంలో తన కాన్వాయ్ లోని వాహనాల సంఖ్యను సగానికి తగ్గించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోగా, ఇదే నిర్ణయాన్ని ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అనుసరించే పరిస్థితి ఉంది.

  Last Updated: 14 May 2026, 09:51 AM IST