AP Budget: ఏపీ బడ్జెట్‌ రూ.2.6 లక్షల కోట్లు? 17న సభలోకి..!

రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ రూ.2.6లక్షల కోట్లకుపైగా ఉండనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి.

  • Written By:
  • Updated On - March 13, 2023 / 07:27 AM IST

రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ (Budget) రూ.2.6 లక్షల కోట్లకుపైగా ఉండనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 17న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్‌ను (Budget) సభలో ప్రవేశపెట్టనున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి పూర్తి స్థాయి పద్దు ఇదే. ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఏడాది ఓటాన్‌ అకౌంట్‌ పద్దుకే పరిమితం కావాల్సి ఉంటుంది. మంగళవారం ఉభయ సభలను (శాసనసభ, శాసనమండలి) ఉద్దేశించి గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించనున్నారు. ఈ నెల 25 లేదా 27వ తేదీతో ఈ సమావేశాలు ముగియనున్నాయి. మంగళవారం రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బిల్లులకు ఆమోదం తెలపనుంది.

రెవెన్యూ రాబడిని మించి మరీ వ్యయాలు ఎంత పరిమితం చేస్తామంటున్నా అంచనాలకు మించే ఖర్చులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో రెవెన్యూలోటు భయపెడుతోంది. ప్రతిసారీ రెవెన్యూ లోటును నియంత్రిస్తామని చెబుతున్నా అది సాధ్యం కాకపోగా అంచనాలు మించిపోతోంది. గడిచిన అయిదేళ్లలో ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతూనే ఉంది. తాజా పరిస్థితుల్లో రాష్ట్రంలో మరో సరళి ప్రబలిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వరంగ కార్పొరేషన్ల నుంచి రుణాలు తెచ్చి కొన్ని కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. వాటిని తీర్చేందుకు రాష్ట్ర ఆదాయాన్ని మళ్లిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్‌లోనే కార్పొరేషన్లకు గ్రాంట్లు మంజూరు చేసి, రుణాలు తీర్చాల్సి వస్తోంది. ఆ అప్పులతో రెవెన్యూ ఖర్చులు చేస్తున్నా వాటిని లెక్కల్లోకి చేర్చట్లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా రెవెన్యూ లోటును, ద్రవ్యలోటును ఉన్నదాని కంటే తక్కువగా చూపిస్తున్నారనే చర్చ జరుగుతోంది.

ఏమిటీ రెవెన్యూ లోటు?

రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ ఖర్చులు ఎక్కువైతే దాన్ని రెవెన్యూ లోటు అంటారు. దీన్ని ఎప్పటికప్పుడు పరిమితం చేసుకుంటే అదే అసలైన ఆర్థిక నిర్వహణ.

రెవెన్యూ రాబడి :

రాష్ట్రంలో సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, పన్నేతర ఆదాయం, కేంద్రం ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ కలిపి రెవెన్యూ రాబడి అవుతుంది. సొంత పన్నుల్లో జీఎస్టీ వసూళ్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం, భూమి శిస్తు, అమ్మకపు పన్ను, రాష్ట్ర ఎక్సైజ్ డ్యూటీలు, కేంద్రపన్నుల్లో వాటాలు, ఇతర పన్నులు-సుంకాల ద్వారా వచ్చే మొత్తం ఉంటాయి.

రెవెన్యూ ఖర్చులు:

జీతాలు, పింఛన్లు, సబ్సిడీలు, వడ్డీల చెల్లింపులతో పాటు ప్రభుత్వనిర్వహణ, ఇతర ప్రభుత్వ పథకాలకు వెచ్చించే మొత్తాలనూ రెవెన్యూ ఖర్చులే అంటారు. వీటితో ప్రభుత్వానికి ఆదాయం రాదు. రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ ఖర్చులు తక్కువ ఉంటే దాన్ని రెవెన్యూ మిగులు అంటారు. రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ ఖర్చులు అధికంగా ఉంటే రెవెన్యూ లోటు అంటారు. ప్రస్తుతం 2022-23 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాల్లో రెవెన్యూ లోటు రూ.17,036.15 కోట్లుగా ఉంటుందని లెక్కించారు. జనవరి వరకు 10 నెలల్లోనే ఇది రూ.47,958.78 కోట్లకు.. అంటే అంచనాలతో పోలిస్తే 281 శాతంగా ఉన్నట్లు లెక్కలు పేర్కొంటున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటును ప్రభుత్వమే రూ.17,036 కోట్లుగా అంచనావేసింది. తొలి పది నెలల్లోనే అది రూ.47,959 కోట్లకు చేరుకుంది. రెవెన్యూ వసూళ్లు తగ్గిపోవడం, రెవెన్యూ వ్యయాలను పరిమితం చేయలేని పరిస్థితుల్లో ఈ సవాలు ఎదురవుతోంది. రెవెన్యూ రాబడులు అంచనాలతో పోలిస్తే మరీ తగ్గిపోతున్నాయి. ఈ తేడాను ఈసారి బడ్జెట్ లో ఎలా సరిచేస్తారు అనేది చూడాలి.

Also Read:  KCR Tantrikam: కేసీఆర్ తాంత్రికం పై పరే’షా’న్, బీజేపీ ఆరా!