Hijab Vs Rs 146 Crores : ఇద్దరు ముస్లిం మహిళల మగ్ షాట్ ఫొటోలను తీసేందుకు పోలీసులు వారి హిజాబ్ను తీయించారు. దీన్ని ఆ ఇద్దరు మహిళలు అవమానంగా భావించారు. కోర్టు తలుపు తట్టారు. 2017 సంవత్సరం నుంచి ఇప్పటివరకు న్యాయపోరాటం చేసి విజయం సాధించారు. వారికి రూ.146 కోట్ల పరిహారాన్ని మంజూరు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
2017 సంవత్సరంలో స్థానిక చట్టాలు, నిబంధనలను అతిక్రమించారనే ఆరోపణలతో అమెరికాలోని న్యూయార్క్ పోలీసులు ఇద్దరు ముస్లిం మహిళలను అరెస్టు చేశారు. వారిని జైలుకు పంపే ముందు నిబంధనల ప్రకారం ఫొటోలు తీశారు. ఈ ఫొటోలను మగ్ షాట్ అని పిలుస్తారు. ఈ ఫొటోల కోసం పోలీసులు ఆ మహిళల హిజాబ్ను తొలగించారు. దీనిని బాధిత మహిళలు అవమానంగా భావించారు. దీనిపై 2018 సంవత్సరంలో కోర్టును ఆశ్రయించారు. ‘‘ఇద్దరు ముస్లిం మహిళల మత విశ్వాసాలను లెక్కలోకి తీసుకోకుండా పోలీసులు వారి హిజాబ్ను బలవంతంగా తొలగించి తీవ్రంగా అవమానించారు’’ అని వారి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆరేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత న్యూయార్క్ పోలీసులు బాధిత మహిళలతో పాటు గతంలో ఈ విధంగా ఇబ్బంది పడిన వారికి కూడా పరిహారం చెల్లించేందుకు అంగీకరించారు. ఈ ఇద్దరు బాధిత మహిళలకు ఒక్కొక్కరికీ 7 వేల నుంచి పది వేల డాలర్ల చొప్పున మొత్తం 17.5 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు న్యూయార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్ అంగీకరించింది. మన రూపాయల్లో ఈ పరిహారం విలువ దాదాపు రూ. 146 కోట్లకు(Hijab Vs Rs 146 Crores) సమానం.
Also Read : Left Vs Rahul Gandhi : లెఫ్ట్ వర్సెస్ రాహుల్ .. వయనాడ్లో వెరైటీ పాలిటిక్స్!
ఈ కేసు నేపథ్యంలో మగ్ షాట్ నిబంధనలపై అమెరికా అంతటా పెద్దఎత్తున చర్చ జరిగింది. దీనిపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తం కావడంతో 2020లో మగ్ షాట్ నిబంధనలలో పోలీసులు మార్పులు కూడా చేశారు. మగ్ షాట్ ఫొటోల కోసం ముస్లిం మహిళలు హిజాబ్ తొలగించనవసరం లేదని, ముఖం కనిపించేలా ఉంటే చాలని స్పష్టం చేశారు. ఈ నిబంధన మిగతా మతాల వారికీ వర్తిస్తుందని, సిక్కులు కూడా తమ టర్బన్ను తొలగించాల్సిన అవసరం పోలీసులు తేల్చి చెప్పారు.