అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ అధ్యక్ష రేస్ మొదలు పెట్టిన వేళ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి (US Modi) ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆహ్వానం పలికారు. అమెరికా పర్యటనకు ఈ వేసవిలో వెళ్లడానికి పీఎంవో షెడ్యూల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు బిడెన్(Biden) ఆహ్వానాన్ని పీఎంవో సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. రెండు దేశాల అధికారులు బిడెన్, మోడీ కలుసుకోవడానికి అనుకూలమైన తేదీలను గుర్తించారు.
గ్రూప్ ఆఫ్ 20 (G-20) దేశాలకు భారతదేశం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో వైట్ హౌస్ నుంచి ఆహ్వానం వచ్చింది. ఆ క్రమంలో, సెప్టెంబర్లో జరిగే G-20 శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన పలు ఈవెంట్లను భారతదేశం ఈ ఏడాది నిర్వహించనుంది. దీనికి బిడెన్ (Biden) హాజరవుతారు. యుఎస్ ప్రతినిధుల సభ, సెనేట్ రెండూ సెషన్లో ఉన్న జూన్ , జూలైలలో రెండు వైపుల అధికారులు తగిన తేదీల కోసం చూస్తున్నారు. అయితే పిఎం మోడీ షెడ్యూల్ దేశీయ కట్టుబాట్లు, ఇతర అంతర్జాతీయ అంశాల గురించి కూడా స్పష్టంగా ఉంది.
Also Read : BBC Modi : మోడీకి US, UK మద్ధతు,BBC డాక్యుమెంటరీ పక్షపాతమని తేల్చివేత
అమెరికా పర్యటన సందర్భంగా US కాంగ్రెస్ సంయుక్త పార్లమెంట్ ను ఉద్దేశించి మోడీ ప్రసంగం, వైట్ హౌస్లో విందు ఉంటాయని తెలుస్తోంది. బిడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రధాని మోదీ అమెరికాకు(US Modi) వెళ్లడం ఇది రెండోసారి. సెప్టెంబరు 2021లో ప్రధానమంత్రి వాషింగ్టన్కు ఉన్నత స్థాయి పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో బిడెన్తో ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించారు.
నవంబర్ 2022లో బాలిలో జరిగిన G-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ చివరిసారిగా ప్రెసిడెంట్ బిడెన్ను కలిశారు. ఆ సమావేశంలో ఇరువురు నేతలు భారతదేశం-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం స్థితిని సమీక్షించారు. ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపై కూడా చర్చించారు. అమెరికా పర్యటనకు మోడీ వెళుతున్నాడని పీఎంవో కార్యాలయం నుంచి సమాచారం అందుతోంది. ఎన్నికలకు ముందుగా ఈ పర్యటన కీలకం కానుంది.
Also Read : Modi Gold Statue: బంగారంతో మోడీ విగ్రహం.. ప్రధానికి ప్రేమతో!
గత అమెరికా ఎన్నికలకు ముందుగా మోడీ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆ సందర్భంగా ట్రంప్ కు మద్ధతు పలికారు. హౌ డూ మోడీ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎన్నారైల మద్ధతు ట్రంప్ కు ఉండేలా ప్రచారం నిర్వహించారు. ఆ సందర్భంగా ట్రంప్, మోడీ జోడీ అమెరికాలోని ఎన్నారైలను ఆకర్షించింది. ఈ సారి ట్రంప్ వచ్చే ఎన్నికలకు ప్రచారం మొదలు పెట్టారు. అదే సమయంలో జో బిడెన్ ఆహ్వానం మేరకు అమెరికా వెళుతోన్న మోడీ అడుగులు ఎటు పడతాయో ఆసక్తికరం. డెమొక్రాట్లకు ఎక్కువగా ఎన్నారైల మద్ధతు ఉంటుంది. కానీ, గత ఎన్నికల్లో మోడీ రిపబ్లిక్ పార్టీకి మద్ధతు ఇచ్చేలా ఎన్నారైల మైండ్ సెట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ, రిపబ్లికన్ల నుంచి రెండోసారి పోటీ చేసిన ట్రంప్ ఓడిపోయారు. అయినప్పటికీ అమెరికా సెనేట్, ప్రతినిధుల సభల్లో ఎన్నారై మూలాలు ఉన్న అధికార, అనధికార ప్రతినిధులు ఉన్నారు. దీంతో భారత్ తో సాన్నిహిత్యం కొనసాగుతోంది. ఆ నేపథ్యంలో మోడీ అమెరికా పర్యటన మరోసారి ఎన్నికలకు ముందుగా ఖరారు కావడం గమనార్హం.