ఇరాన్పై ఇజ్రాయెల్తో కలిసి ఏకపక్షంగా యుద్ధానికి దిగిన అమెరికాకు ఇప్పుడు గడ్డు కాలం మొదలైంది. యుద్ధం ప్రారంభమై నాలుగు వారాలు గడుస్తున్నా, ఆశించిన ఫలితాలు రాకపోగా.. అగ్రరాజ్యం వ్యూహాత్మక తప్పిదాల్లో కూరుకుపోయింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న దూకుడు నిర్ణయాలు అంతర్జాతీయంగా విమర్శలకు దారితీయడమే కాకుండా, స్వదేశంలోనూ ఆయనపై తీవ్ర వ్యతిరేకతను పెంచుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం నుండి గౌరవప్రదంగా ఎలా బయటపడాలో తెలియక వైట్ హౌస్ సతమతమవుతోంది. ఈ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు దెబ్బతిన్నప్పటికీ, అమెరికన్లు మాత్రం ట్రంప్ అనుసరిస్తున్న మొండి వైఖరిని అసహ్యించుకుంటున్నారు.
తాజాగా వెలువడిన రాయిటర్స్-ఇప్సోస్ (Reuters-Ipsos) సర్వే ఫలితాలు ట్రంప్కు గట్టి షాక్ ఇచ్చాయి. యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకడం, తద్వారా అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడం ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. ఈ సర్వే ప్రకారం, ట్రంప్ ప్రజాదరణ రికార్డు స్థాయిలో 36 శాతానికి పడిపోయింది. గత వారం 40 శాతంగా ఉన్న ఆదరణ, కేవలం ఏడు రోజుల వ్యవధిలోనే 4 శాతం తగ్గిపోవడం గమనార్హం. అంటే మెజారిటీ అమెరికన్లు ట్రంప్ యుద్ధ తంత్రాన్ని మరియు ఆర్థిక విధానాలను ఏమాత్రం సమర్థించడం లేదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితి ట్రంప్ పరిపాలనకు ఒక అగ్నిపరీక్షగా మారింది. ఒకవైపు అంతర్జాతీయంగా మిత్రదేశాల నుంచి ఒత్తిడి పెరుగుతుండగా, మరోవైపు సొంత దేశంలోనే ప్రజల మద్దతు కోల్పోవడం ఆయనను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టింది. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే ఆర్థిక వ్యవస్థ మరింత కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే ఎన్నికల నాటికి ఈ ప్రజాదరణను తిరిగి పుంజుకోవాలంటే, ట్రంప్ తన యుద్ధ వ్యూహాన్ని మార్చుకోవడమో లేదా శాంతి చర్చల వైపు అడుగులు వేయడమో తప్పనిసరి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
