Trump Tariffs On India Reduced To 18% From 25% భారత్- అమెరికా వాణిజ్య సంబంధాలకు సంబంధించి కీలక ప్రకటన వచ్చింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయులకు శుభవార్త చెప్పారు. భారత్పై విధిస్తున్న దిగుమతి సుంకాల్ని 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ.. భారత ప్రజల తరఫున ట్రంప్కు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ట్రంప్.. భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నట్లు తెలిపారు.
ఎన్నో నెలలు, సంవత్సరాల ఎదురుచూపుల తర్వాత.. భారత్- అమెరికా వాణిజ్య సంబంధాలపై ఒక క్లారిటీ వచ్చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నా అని ట్రంప్ ప్రకటించారు. ఇదే క్రమంలో భారత్పై ప్రస్తుతం విధిస్తున్న 50 శాతం దిగుమతి సుంకాల్ని.. 18 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. దీంతో భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు తగ్గనున్నాయి. ఇదే సమయంలో అమెరికాపై భారత్ విధిస్తున్న సుంకాల్ని కూడా జీరో స్థాయికి తగ్గించేందుకు భారత్ అంగీకరించిందని ట్రంప్ అన్నారు. ఇంకా రష్యా నుంచి చమురు దిగుమతుల్ని కూడా నిలిపివేసేందుకు భారత్ అంగీకరించినట్లు పేర్కొన్నారు. భారత్పై ఇప్పటివరకు దిగుమతి సుంకాలు 50 శాతంగా ఉండేవి. తొలుత దీనిని 25 శాతానికి పెంచగా.. ఇదే సమయంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు దీనిని రెట్టింపు చేసి 50 శాతానికి చేర్చారు. ఇప్పుడు ఈ సుంకాలు 18 శాతానికి తగ్గనున్నాయి.
Pmmodi
ట్రంప్ ప్రకటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. భారత ఉత్పత్తులపై ఇక నుంచి అమెరికా దిగుమతి సుంకం 18 శాతానికి తగ్గనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం చాలా సంతోషం కలిగిస్తుందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇక అద్భుత ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరఫున అధ్యక్షుడు ట్రంప్కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. డీల్ ప్రకటనకు ముందు మోదీకి.. ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు.
అమెరికా సుంకాలు తగ్గిస్తున్నట్లు ప్రకటించిన మోదీ.. తన ట్వీట్లో ట్రేడ్ డీల్ గురించి మాత్రం ప్రస్తావించలేదు. ప్రపంచంలోనే ఈ రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిసి పని చేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని.. ఎన్నో అవకాశాలు వస్తాయని అన్నారు. ప్రపంచ శాంతికి.. సుస్థిరత నెలకొనాలన్నా.. సుసంపన్నతకు అయినా ట్రంప్ నాయకత్వం కీలకం అని ప్రశంసించారు.
శ్వేతసౌధం కూడా భారత్పై విధించిన అదనపు సుంకాల తొలగింపును ధ్రువీకరించింది. సోమవారం రోజు మోదీకి.. ట్రంప్ ఫోన్ చేశారు. తర్వాత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ట్రంప్ దీని గురించి ప్రకటన చేశారు. ‘ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడటాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఆయన నాకున్న గొప్ప స్నేహితుల్లో ఒకరు. ఆయన శక్తిమంతమైన నాయకుడు. మేం చాలా విషయాలే మాట్లాడుకున్నాం. రష్యా చమురు కొనుగోలు నిలిపివేతకు కూడా భారత్ అంగీకరించింది. ఇది ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతుందని భావిస్తున్నా. మోదీపై గౌరవం ఉన్న నేపథ్యంలో.. ఆయన విజ్ఞప్తి మేరకు వెంటనే ట్రేడ్ డీల్కు అంగీకరిస్తున్నా. అమెరికా ఉత్పత్తుల్ని కూడా భారత్ భారీగా కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. మా బంధం మరింత బలంగా ముందుకు సాగనుంది.’ అని ట్రంప్ ప్రకటన చేశారు. ఇక ట్రంప్- మోదీ ఫోన్లో మాట్లాడుకున్నారని భారత్లో యూఎస్ అంబాసిడర్ సెర్గియో గోర్ కూడా ఎక్స్లో ప్రకటించారు.
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
ట్రేడ్ డీల్పై ట్రంప్ ప్రకటన నేపథ్యంలో.. భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం రోజు భారీ లాభాల్లో ఆరంభమయ్యాయి. సెన్సెక్స్ ఆరంభంలో 3 వేలకుపైగా పాయింట్ల లాభంతో మొదలవ్వగా ప్రస్తుతం 2200 పాయింట్ల లాభంతో 84 వేల స్థాయిలో ఉంది. నిఫ్టీ 700 పాయింట్ల లాభంతో 25,800 స్థాయిలో ఉంది. ఆరంభంలో ఇది 1400 పాయింట్ల వరకు పుంజుకుంది.
పుంజుకున్న రూపాయి..
ట్రంప్ ప్రకటనతో.. స్టాక్ మార్కెట్లు పుంజుకోవడమే కాదు రూపాయి విలువ కూడా భారీగా పెరిగింది. డాలరుతో పోలిస్తే ఇవాళ ఏకంగా 1.20 శాతం వరకు పెరిగి రూ. 90.30 స్థాయిలో ట్రేడవుతోంది. కిందటి రోజు ఇది రూ. 91.50 స్థాయిలో ఉండేది.
