అమెరికా సైన్యానికి చెందిన అపాచీ హెలికాప్టర్ సోమవారం హర్మూజ్ జలసంధి సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లోని ఇద్దరు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని, వారికి ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ధృవీకరించారు.
న్యూయార్క్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ట్రంప్, “పైలట్లు క్షేమంగా ఉన్నారు, ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు” అని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక నివేదికను మంగళవారం విడుదల చేస్తామని ఆయన తెలిపారు.
ప్రపంచం చమురు రవాణాలో ఐదో వంతు వాటా కలిగిన హర్మూజ్ జలసంధి అత్యంత కీలకమైన ప్రాంతం. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ ప్రమాదం సంభవించడం గమనార్హం. ఇది శత్రువుల దాడి వల్ల జరిగిందా లేదా సాంకేతిక లోపం కారణంగా కుప్పకూలిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రాంతంలో ఇరాన్ కార్యకలాపాలను నియంత్రించే విధుల్లో భాగంగానే ఈ హెలికాప్టర్ సేవలందిస్తున్నట్లు తెలుస్తోంది.
