Traveling To UK: మీరు అవసరమైన పత్రాలు లేకుండా బ్రిటన్కు వెళ్లాలనుకుంటే మిమ్మల్ని చెక్-ఇన్ కౌంటర్ వద్దే నిలిపివేస్తారు. బ్రిటిష్ ప్రభుత్వం 85 దేశాల ప్రయాణికులకు ఎలక్ట్రానిక్ ట్రావెల్ పర్మిట్ (ETA) తప్పనిసరి చేసింది. 2023లో ప్రారంభించిన ఈ ETA పథకం ప్రకారం వీసా అవసరం లేని ప్రయాణికులు కూడా ముందుగా 16 పౌండ్లు (సుమారు రూ. 1,800 – రూ. 2,000) ఖర్చు చేసి ఆన్లైన్లో ట్రావెల్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ నియమం అమెరికా, కెనడా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలతో సహా 85 దేశాల పౌరులకు వర్తిస్తుంది.
బ్రిటిష్ హోం మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. దేశ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను ఆధునీకరించేందుకు ఈ చర్య తీసుకున్నారు. దీనివల్ల దేశంలోకి వచ్చే ప్రతి వ్యక్తి సమాచారం ప్రభుత్వం వద్ద ముందుగానే ఉంటుంది. తద్వారా భద్రతాపరమైన ముప్పులను తగ్గించవచ్చు.
Also Read: Fire Accident in Jubilee Hills : జూబ్లీహిల్స్ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం
ETA పథకం అంటే ఏమిటి?
‘ఇండియా టుడే’ నివేదిక ప్రకారం.. ETA పథకాన్ని 2023లో పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించారు. అయితే ఇప్పటివరకు దీనిని అంత కఠినంగా అమలు చేయలేదు. ఇప్పుడు UK ప్రభుత్వం దీనిని పూర్తిగా తప్పనిసరి చేసింది. బ్రిటన్ వెళ్లడానికి వీసా అవసరం లేని ప్రయాణికులు, అక్కడికి చేరుకోవడానికి ముందే 16 పౌండ్లు చెల్లించి ఆన్లైన్లో అనుమతి తీసుకోవాలి. ఒకసారి అనుమతి లభిస్తే 6 నెలల వరకు బ్రిటన్లో ఉండేందుకు వీలుంటుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది. కేవలం ప్రభుత్వ వెబ్సైట్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. బ్రిటన్ సరిహద్దులను మరింత డిజిటల్, సురక్షితంగా మార్చడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం.
ప్రయాణికుడి వద్ద ETA, eVisa లేదా ఇతర చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకపోతే ఎయిర్లైన్స్ వారిని బోర్డింగ్ చేయడానికి అనుమతించవు. అయితే బ్రిటిష్, ఐరిష్ పౌరులకు, అలాగే బ్రిటన్లో నివసించే హక్కు ఉన్నవారికి ఈ నియమం నుండి మినహాయింపు ఉంటుంది.
మైగ్రేషన్ మినిస్టర్ మైక్ ట్యాప్ ఏమన్నారంటే?
మైగ్రేషన్ మినిస్టర్ మైక్ ట్యాప్ మాట్లాడుతూ.. మా సరిహద్దు భద్రతను బలోపేతం చేయడంలో ETA పథకం ఒక ముఖ్యమైన భాగం. ఇది ప్రయాణికులకు, బ్రిటిష్ ప్రజలకు మరింత సమర్థవంతమైన, ఆధునిక సేవలను అందిస్తుంది. ఈ మార్పు యూరోపియన్ యూనియన్ కొత్త ఎంట్రీ/ఎగ్జిట్ సిస్టమ్ (EES)తో పాటు వచ్చింది. ఇది బ్రెక్సిట్ తర్వాత UK పౌరులకు కూడా కఠినంగా మారుతోంది. ప్రయాణించే ముందు తప్పనిసరిగా ETA చెక్ చేసుకోండి, లేదంటే మీ ప్లాన్ పాడయ్యే అవకాశం ఉంది అని తెలిపారు.
