Israel Vs Hezbollah : ఇజ్రాయెల్కు త్వరలోనే సర్ప్రైజ్ ఇస్తామని ఇరాన్ మద్దతు కలిగిన లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా ప్రకటించింది. తాము ఆకస్మిక దాడికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది. హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ సెక్రటరీ జనరల్ హసన్ నస్రల్లా ఓ వీడియో సందేశంలో మాట్లాడుతూ.. ‘‘ఇజ్రాయెల్ త్వరలో సర్ప్రైజ్కు సిద్ధంగా ఉండాలి’’ అని హెచ్చరించారు. ‘‘పాలస్తీనా రాజ్యాన్ని అనేక యూరోపియన్ దేశాలు గుర్తించడం ద్వారా ఇజ్రాయెల్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ నాయకులు గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ ఏం సాధించలేదని అంగీకరించారు. తాము ఈ యుద్ధంలో ఎలాంటి వ్యూహాత్మక లక్ష్యాలను సాధించలేదని ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మండలి అధిపతి త్జాచి హనెగ్బీ ఒప్పుకున్నారు. పాలస్తీనాలో తమ లక్ష్యాలను సాధించడానికి కొన్ని సంవత్సరాల టైం పట్టొచ్చని వెల్లడించారు’’ అని హసన్ నస్రల్లా గుర్తు చేశారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘గాజాలోని రఫా నగరంపై సైనిక దాడిని ఆపేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశించినప్పటికీ ఇజ్రాయెల్ వినడం లేదు. అంతర్జాతీయ చట్టాలంటే ఇజ్రాయెల్కు లెక్కలేదు. రఫాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. అమాయకుల ప్రాణాలు తీస్తోంది’’ అని హసన్ నస్రల్లా(Israel Vs Hezbollah) చెప్పారు. ఆకస్మిక దాడి అంటూ.. ముందుగానే సమాచారాన్ని హిజ్బుల్లా ప్రకటించడంపై ఇప్పుడు ఇజ్రాయెల్ మీడియాలో వాడివేడి చర్చ జరుగుతోంది. పటిష్టమైన నిఘా వ్యవస్థలు, సైనిక వ్యవస్థలు కలిగిన ఇజ్రాయెల్ కూడా ఇప్పటికే లెబనాన్ బార్డర్లో అలర్ట్ అయిందని తెలుస్తోంది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన కొన్ని రోజుల తర్వాత హిజ్బుల్లా నుంచి తాజా హెచ్చరికను ఇజ్రాయెల్ కూడా సీరియస్గానే తీసుకుంటోందని తెలుస్తోంది.
పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తూ ఇటీవల స్పెయిన్, నార్వే, ఐర్లాండ్ దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ నెల 28 నుంచి తమ ఈ గుర్తింపు నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపాయి. ఈ మూడు దేశాలు చేసిన ప్రకటనను పాలస్తీనా నేతలు స్వాగతించారు. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్(పీఎల్ఓ) దీన్ని ‘‘చరిత్రాత్మక ప్రకటన’గా అభివర్ణించింది. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడం ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్యలో శాంతి చర్చల పురోగతికి ఉపయోగపడుతుందని ఈ దేశాలు భావిస్తున్నాయి. అయితే, ఈ ప్రకటనపై ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబర్ 7న జరిగిన దాడుల వీడియోను చూడాలంటూ ఆ మూడు దేశాల రాయబారులకు తెలుపుతూ ఇజ్రాయెల్ సమన్లు జారీ చేసింది.