అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో శుభవార్త చెప్పారు. కొన్ని రకాల వ్యవసాయ, పారిశ్రామిక పరికరాలపైన దిగుమతి సుంకాలను 10 శాతం వరకు తగ్గించారు. అంతకుముందు 25 శాతంగా ఉండగా, దీనిని 15 శాతానికి తగ్గించారు. అయితే ఇది తాత్కాలిక తగ్గింపు మాత్రమేనని స్పష్టం చేశారు. ఇది 2027 డిసెంబర్ వరకు అమల్లో ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను చూద్దాం.
ఒకవైపు అమెరికా-ఇరాన్ యుద్ధం ముగింపుపై ఎలాంటి స్పష్టత లేదు. శాంతి ఒప్పందం అమలవుతుందని భావించినా.. ప్రస్తుతం దీని గురించి స్పష్టత లేదు. అయితే అటు యుద్ధం జరుగుతున్నా.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. పరికరాల తయారీ రంగానికి శుభవార్త అందిస్తూ.. టారిఫ్స్ తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయం సహా పరిశ్రమల్లో వాడే ఉపకరణాల దిగుమతుల విషయంలో ట్రంప్ మెత్తబడ్డారు. ముందుగా వాటిపై 25 శాతం సుంకాలు అమల్లో ఉండేవి కాగా.. దీనిని తాజాగా 10 శాతం తగ్గించి 15 శాతానికి కుదించినట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది చివరి వరకు అంటే.. 2027 డిసెంబర్ వరకు టారిఫ్స్ తగ్గింపు నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఈ టారిఫ్స్ తగ్గింపు ప్రధానంగా హార్వెస్టర్స్ వంటి యంత్రాలు, ఇతర పరికరాలకు ఉండనుంది.
ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పెట్టుబడికి అండగా ఉండేందుకు.. మరియు ఉత్పత్తిదారుల ఖర్చులను తగ్గించేందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన కార్యవర్గం వెల్లడించింది. ఇదే సమయంలో సుంకం తగ్గింపు వర్తించే పరికరాల పరిధిని కూడా పెంచడం విశేషం. దీంతో పారిశ్రామిక రంగంలో వాడే బుల్డోజర్స్, ఫోర్క్ లిఫ్ట్లు వంటి వాటి దిగుమతులు ఇప్పుడు మరింత చౌకగా మారనున్నాయి. ఇప్పటికే అమెరికాతో ట్రేడ్ డీల్స్ చేసుకున్న దేశాలకు కూడా ఈ తగ్గింపు వర్తిస్తుంది.
ఇదే సమయంలో అమెరికా లోహ రంగంలో ఉత్పత్తిని పెంచాలన్న లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం మరో తాయిలాన్ని కూడా ప్రకటించింది. విదేశీ తయారీ కంపెనీలు ఏవైనా మూలధన పరికరాలను దిగుమతి చేసుకుంటే.. వాటి మొత్తం బరువులో 85 శాతం అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న స్టీల్, అల్యూమినియం వినియోగిస్తే 10 శాతం సుంకం మాత్రమే వర్తిస్తుంది.
2027 డిసెంబర్ వరకు ఈ తగ్గింపులు కొనసాగుతాయని వైట్ హౌస్ వెల్లడించింది. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం.. అమెరికా పారిశ్రామిక రంగ పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని తెలిపింది. విదేశాల నుంచి అల్యూమినియం, స్టీల్, కాపర్ వంటి దిగుమతులపై అమెరికా జాతీయ భద్రత కోసమే టారిఫ్స్ విధించినట్లు వివరణ ఇచ్చింది. ఇక భారత్ విషయానికి వస్తే.. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంతో మహీంద్రా అండ్ మహీంద్రా సహా టీఏఎఫ్ఈ, ఫీల్డ్ కింగ్, శక్తిమాన్, జైన్ ఇరిగేషన్ వంటి సంస్థలు అమెరికాకు పెద్ద ఎత్తున వ్యవసాయ పరికరాలను ఎగుమతి చేస్తుంటాయి. ఈ క్రమంలో ఈ కంపెనీలతో సహా భారత పరిశ్రమలకు ట్రంప్ నిర్ణయంతో కొంత మేర ప్రయోజనం చేకూరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
