Nigeria : నైజీరియాలో ప్రజలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. తమ పరిస్థితిని తెలియజేసేందుకు నిరసనలకు దిగే వారిపై అక్కడి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదం మోపుతోంది. కఠిన శిక్షలు విధిస్తోంది. జైళ్లలో పెడుతోంది. ఈవిధంగా నిరసనలు తెలిపిన వారిలో 76 మందిపై రకరకాల కేసులు పెట్టగా.. 29 మందికి మరణశిక్షను విధించారు. అయితే వీరంతా చిన్నారులే కావడం ఆందోళనకరం. 14 ఏళ్లలోపు వారికి మరణశిక్ష విధిస్తూ నైజీరియా కోర్టు ఆదేశాలు ఇవ్వడాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. 29 మంది చిన్నారులను విచారణ నిమిత్తం కోర్టుకు తీసుకెళ్లారు. ఈ కేసుపై విచారణ జరుగుతుండగా.. కోర్టు ఆవరణలోనే నలుగురు పిల్లలు ఆకలితో అలమటిస్తూ సొమ్మసిల్లి కింద పడిపోయారు.
Also Read :Asaduddin : నేను నోరు విప్పితే బీఆర్ఎస్ వాళ్లు ఇబ్బందిపడతారు : అసదుద్దీన్
నైజీరియాలో కరెన్సీ విలువ(Nigeria) పడిపోయింది. దేశంలో ధాన్యం నిల్వలు అడుగంటాయి. నిత్యావసరాల ధరలు చుక్కలను అంటాయి. దీంతో అక్కడి ప్రజల జీవన స్థితి దారుణంగా తయారైంది. అందుకే అక్కడి ప్రజలు నిరసనకు దిగుతున్నారు. ప్రభుత్వం నుంచి సాయాన్ని కోరుతున్నారు. ఇక 76 మంది నిరసనకారులపై దేశద్రోహం, తిరుగుబాటు, ఆస్తుల విధ్వంసం సహా 10 రకాల అభియోగాలను మోపారు. వాస్తవానికి నైజీరియా బాలల హక్కుల చట్టం ప్రకారం పిల్లలపై క్రిమినల్ ప్రోసీడింగ్స్ చేయడానికి కానీ.. మరణశిక్ష విధించడానికి కానీ పర్మిషన్ లేదు. ఈవాదననే మైనర్ల తరఫు లాయర్ వినిపించగా.. ఆ వాదనతో కోర్టు ఏకీభవించింది.ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల పూచికత్తుతో కఠినమైన ఆంక్షలతో నిందితులుగా ఉన్న బాలలకు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఏడాది ఆగస్టులో నైజీరియా యువత నిరసనలకు దిగగా.. 20 మందిని కాల్చి చంపారు. వందలాది మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. 1970లో నైజీరియాలో మరణశిక్ష అమలులోకి వచ్చింది. అయితే 2016 నుంచి నైజీరియాలో ఏ ఒక్కరికీ ఉరిశిక్ష అమలు కాలేదు. అయితే నైజీరియా పరిస్థితులు మెరుగుపడాలంటే అక్కడి ప్రభుత్వం వైఖరి మారాలి. ప్రజలను అణచివేయడం ఆపేసి.. సంస్కరణలు చేయడంపై ఫోకస్ పెట్టాలి.