US Commerce Secretary Howard Lutnick భారత్-అమెరికా మధ్య ఎంతో కాలంగా ఊరిస్తున్న భారీ వాణిజ్య ఒప్పందం ఎందుకు ఆగిపోయింది? రెండు దేశాల మధ్య చర్చలు ఎక్కడ బెడిసికొట్టాయి? దీనిపై అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుత్నిక్ షాకింగ్ నిజాలను బయటపెట్టారు. “అన్నీ సిద్ధం చేశాం.. కానీ ప్రధాని మోదీ నుంచి ట్రంప్కు రావాల్సిన ఆ ఒక్క ఫోన్ కాల్ రాలేదు.. అందుకే మేం వెనక్కి తగ్గాం” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కార్యరూపం దాల్చకపోవడానికి కారణమేమిటో అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుత్నిక్ సంచలన రీతిలో బయటపెట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేరుగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఫోన్ చేసి మాట్లాడకపోవడం వల్లే ఈ ఒప్పందం నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో లుత్నిక్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి.
‘మోదీ ఫోన్ చేయలేదు.. అందుకే మేం వెనక్కి తగ్గాం’
“నేను ఒప్పందానికి అన్ని ఏర్పాట్లు చేశాను. కానీ ప్రధాని మోదీ స్వయంగా ట్రంప్కు ఫోన్ చేయాల్సి ఉంది. అయితే ఆ పని చేయడానికి భారత్ అసౌకర్యంగా భావించింది. మోదీ నుంచి కాల్ రాకపోవడంతో అమెరికా ఈ ఒప్పందం నుంచి తప్పుకుంది. ఇకపై దీని గురించి మేము ఆలోచించడం లేదు” అని లుత్నిక్ కుండబద్దలు కొట్టారు. ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాలతో అమెరికా ఒప్పందాలు చేసుకుందని.. భారత్తో అంతకంటే ముందే డీల్ కుదురుతుందని భావించినా.. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అది సాధ్యం కాలేదని ఆయన వివరించారు.
500 శాతం టారిఫ్ హెచ్చరిక
మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. రష్యా వ్యాపార భాగస్వాములైన భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై 500 శాతం వరకు అదనపు సుంకాలు విధించేలా రూపొందించిన కొత్త ఆంక్షల బిల్లుకు ట్రంప్ ఆమోదం తెలిపారు. రష్యా చమురు కొనుగోళ్ల ద్వారా పుతిన్కు అందుతున్న ఆర్థిక వనరులను అడ్డుకోవడమే దీని లక్ష్యమని అమెరికా సెనేటర్లు పేర్కొంటున్నారు. రష్యా చమురు కొనుగోళ్లపై తన అసంతృప్తిని మోదీకి ముందే తెలియజేశానని.. అవసరమైతే టారిఫ్లను చాలా వేగంగా పెంచుతామని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు.
సవాళ్ల మధ్య సాగుతున్న వాణిజ్యం
ఇన్ని ఒత్తిళ్ల మధ్య కూడా భారత్-అమెరికా వాణిజ్యం పుంజుకోవడం విశేషం. నవంబర్ నెలలో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు 22.61 శాతం వృద్ధి చెందాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 131.84 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరిగింది. అయితే వ్యవసాయ ఉత్పత్తులు, డెయిరీ రంగాల్లో రాయితీలు కావాలని అమెరికా పట్టుబడుతుండగా.. భారత రైతుల ప్రయోజనాలను తాము పణంగా పెట్టలేమని ఢిల్లీ స్పష్టం చేస్తోంది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యానికి ఈ రాజకీయ, దౌత్య పరమైన అడ్డంకులు సవాలుగా మారాయి. చూడాలి మరి మున్ముందు ఏం జరగనుంది అనేది.
