Biden Vs Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ జో బైడెన్, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి తలపడేందుకు లైన్ క్లియర్ అయింది. రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ తరఫున జో బైడెన్ అధ్యక్ష అభ్యర్థులుగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వీరు ఒకరిపై ఒకరు పోటీ చేయనున్నారు.ఈ ఇద్దరికీ ఆయా పార్టీల నుంచి ప్రెసిడెంట్ అభ్యర్థిత్వానికి కావాల్సినంత మేర ప్రతినిధుల మద్దతు లభించింది. అమెరికా అధ్యక్షులుగా పని చేసిన ఇద్దరు అభ్యర్థులు రెండోసారి పోటీపడటం 1912 తర్వాత ఇదే తొలిసారి. 2020 సంవత్సరంలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంపుపై బైడెన్ విజయం సాధించారు. ట్రంప్ ప్రస్తుతం నాలుగు క్రిమినల్ కేసుల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులు అమెరికా ఓటర్లపై ప్రభావం చూపిస్తాయా ? చూపవా ? వేచిచూడాలి. జో బైడెన్ రాజకీయ వేధింపుల్లో భాగంగానే తనపై ఆయా కేసులు నమోదయ్యాయని ట్రంప్ అంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join
రిపబ్లికన్ పార్టీ తరఫున దేశ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేసేందుకు ట్రంప్కు 1215 మంది ప్రతినిధుల మద్దతు అవసరం. అయితే ఇప్పటికే ఆయన 1228 మంది ప్రతినిధుల మద్దతును సాధించారు. రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్పై పోటీ చేసేందుకు ఎవరూ మిగల్లేదు. నిక్కీ హేలీ చివరి వరకు పోటీ చేసి.. తప్పుకున్నారు.
డెమొక్రటిక్ పార్టీ తరఫున దేశ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రెసిడెంట్ జో బైడెన్కు కనీసం 1,969 మంది ప్రతినిధుల మద్దతు అవసరం. అయితే బైడెన్ అంతకుమించి 2,107 మంది ప్రతినిధుల సపోర్టును సంపాదించారు. మంగళవారం అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన రిపబ్లికన్ , డెమొక్రటిక్ పార్టీల ప్రైమరీ ఎన్నికల్లో వీరిద్దరూ ఈ మెజారిటీని సాధించారు. దీంతో ట్రంప్, బైడెన్లు ఎన్నికల్లో పోటీపడడం ఖాయమైంది.
ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే వాషింగ్టన్లోని పార్లమెంటుపై దాడికి పాల్పడిన తన మద్దతుదారులందరినీ రిలీజ్ చేస్తానని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ‘‘అమెరికా ప్రజలు దేశ భవిష్యత్ గురించి నిర్ణయం తీసుకునే టైం వచ్చింది. నేను గెలిస్తే ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తా. మన స్వేచ్ఛను రక్షించుకునే హక్కును పునరుద్దరిస్తా’’ అని వెల్లడించారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్(Biden Vs Trump) గెలిచాక ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పట్లో అనేక మంది ట్రంపు మద్దతుదారులు పార్లమెంటును ముట్టడించారు. ఈ కేసులో దాదాపు 1300 మందికి పైగా అరెస్టయ్యారు.