Iran Vs Israel : ఇజ్రాయెల్ రక్షణ బలగాల అధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జిహలేవి కీలక ప్రకటన చేశారు. తమ దేశంపై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసినందుకు ఇరాన్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన వెల్లడించారు. ‘‘మా దేశంపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకొని తీరుతాం. ఆ దేశంపై ప్రతిదాడి తప్పదు. ఇందుకోసం ఆపరేషన్ ‘ఐరన్ షీల్డ్’ చేపడతాం’’ అని హెర్జిహలేవి తేల్చి చెప్పారు. ‘‘మా దేశం వ్యూహాత్మక సైనిక సామర్థ్యాలను దెబ్బతీయాలని ఇరాన్ భావించింది. గతంలో ఎన్నడూ ఎవరూ ఇలాంటి ప్రయత్నం చేయలేదు’’ అని ఆయన చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘ఒకవేళ మేం ఇప్పుడు స్పందించకుండా వదిలేస్తే.. భవిష్యత్తులో ఇరాన్ నుంచి మరింత ముప్పు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది’’ అని హెర్జిహలేవి పేర్కొన్నారు. ఇరాన్ విషయం తేలే దాకా గాజాలోని రఫాపై ఆపరేషన్ను నిలిపివేయాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇరాన్పై ప్రతిదాడి చేయాలా ? వద్దా ? అనే దానిపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఇజ్రాయెల్కు ఉందని అమెరికా స్పష్టం చేసింది. ఈ పరిణామాలపై ఇరాన్(Iran Vs Israel) ఘాటుగా స్పందించింది. తమపై ప్రతిదాడికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది.
ఇజ్రాయెల్పై ఎటాక్ చేస్తామనే ఇన్ఫర్మేషన్ను తాము అమెరికాకు 72 గంటలకు ముందే అందించామని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి హసేన్ అమీర్ అబ్దుల్ల్లా హియాన్ వెల్లడించారు. తాము ఇజ్రాయెల్లోని సైనిక లక్ష్యాలను మాత్రమే టార్గెట్ చేశామని తెలిపారు. ఇజ్రాయెల్ను శిక్షించేందుకు, ఇరాన్ను రక్షించుకునేందుకు ఈ దాడి చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. తమ దాడి గురించి అమెరికాకు ముందస్తు సమాచారం అందించామని వివరించారు. అయితే తమకు ఇరాన్ నుంచి ఎలాంటి సమాచారం అందలేదని అమెరికా తెలిపింది. ఇరాక్, టర్కీ, జోర్డాన్ దేశాలు మాత్రం తమకు ఇరాన్ నుంచి ముందస్తు సమాచారం అందిందని అంటున్నాయి. కాగా, ఇజ్రాయెల్ వైపుగా తమ దేశాల పైనుంచి వెళ్తున్న ఇరానీ మిస్సైళ్లు, డ్రోన్లను కూల్చేశామని సౌదీ అరేబియా, జోర్డాన్ ప్రకటించాయి.