Ali Larijani: ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) మంగళవారం (మార్చి 17, 2026) ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారీజానీ, బాసిజ్ దళ కమాండర్ గులాం రజా సులేమానీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ప్రకటించింది. ఈ దాడిలో గులాం రజా సులేమానీ మరణించినట్లు IDF ధృవీకరించింది. అయితే ఇరాన్ అధికార యంత్రాంగంలో కీలక వ్యక్తి అయిన లారీజానీ ఈ దాడిలో మరణించారా లేదా గాయపడ్డారా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.
అయతొల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడు లారీజానీ
IDF దాడిలో లారీజానీ మరణించారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ పేర్కొన్నారు. మరోవైపు లారీజానీ కార్యాలయం దీనిని ఖండిస్తూ ఆయన త్వరలోనే ప్రెస్తో మాట్లాడతారని తెలిపింది. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత అలీ లారీజానీ ఇరాన్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ఎదిగారు. ఆయన ఖమేనీకి అత్యంత నమ్మకస్తుడైన సహచరుడిగా ఉండేవారు.
Also Read: ప్రసూతి సెలవులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. మూడు నెలల నిబంధన రద్దు!
ట్రంప్పై లారీజానీ విమర్శలు
మంగళవారం ఇరాన్ ప్రభుత్వ మీడియా లారీజానీ పేరుతో ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను తీవ్రంగా విమర్శించారు. ఆ ప్రకటన సారాంశం ఇలా ఉంది. 47 ఏళ్ల క్రితం ఇరాన్ ఇస్లామిక్ విప్లవం సమయంలో ప్రజల నినాదాలు నిజమైనవి కావని, అవి కేవలం టేప్ రికార్డర్ సౌండ్లని అప్పటి పహ్లావీ పాలన ప్రధాని చెప్పారు. ఇప్పుడు ట్రంప్ కూడా ఇరాన్ వీధుల్లో అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేకంగా పోటెత్తుతున్న లక్షలాది మంది ప్రజలను చూసి, అవి AI సృష్టించిన చిత్రాలని అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్నారు.
ముస్లిం దేశాలపై అసహనం
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు ప్రారంభించిన సమయంలో ముస్లిం మెజారిటీ దేశాల నుండి మద్దతు లభించకపోవడంపై లారీజానీ నిరాశ వ్యక్తం చేశారు. సోమవారం (16 మార్చి 2026) ఆయన మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయెల్ చర్చల సాకుతో ఇరాన్ను వంచించి దాడి చేశాయన్నారు. ఇరాన్ను విచ్ఛిన్నం చేయడమే వారి ప్రధాన ఉద్దేశ్యం అని విమర్శించారు. ఈ దాడుల వల్ల ఇస్లామిక్ విప్లవానికి చెందిన గొప్ప నాయకుడు (ఖమేనీ), అనేక మంది పౌరులు, సైనిక కమాండర్లు అమరులయ్యారు అని పేర్కొన్నారు.
