Russian oil రష్యా చమురును భారత్ కొనుగోలు చేయదంటూ అమెరికా మరోసారి స్పష్టం చేసింది. అయితే ఈ అంశంపై ఇప్పటికీ భారత్ నోరు విప్పకపోవడం.. అమెరికా పదే పదే ఈ కామెంట్లు చేయడం అందరిలోనూ అనుమానాలను పెంచింది. ముఖ్యంగా మ్యూనిక్ వేదికగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో.. మరోసారి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయమని తమకు హామీ ఇచ్చిందన్నారు.
భారత్-అమెరికా మధ్య ఇటీవలే ఒప్పందం కుదిరిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు.. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయదని అమెరికా చెప్పింది. దీనిపై భారత్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా రష్యా మాత్రం భారత్ మాకు ఆ విషయం చెప్పలేదని తేల్చింది. ఆ తర్వాత ఎక్కడి నుంచి భారత్ చమురు కొనుగోలు చేసినా తమకు ఏ ఇబ్బంది లేదని చెప్పింది. ఈక్రమంలోనే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో మరోసారి ఈ విషయంపై స్పందించారు. ముఖ్యంగా రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపి వేసేందుకు భారత్ సిద్ధంగా ఉందంటూ తాజాగా ప్రకటించారు. జర్మనీలోని మ్యూనిక్ భద్రతా సదస్సులో ప్రసంగించిన ఆయన.. ఈ విషయంలో ఢిల్లీ నుంచి తమకు స్పష్టమైన హామీ లభించిందని ధృవీకరించారు.
భారత్కు భారీ ఊరట!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్ గురించి మాట్లాడుతూ.. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపివేసేందుకు మోదీ ప్రభుత్వం అంగీకరించిందని ప్రకటించారు. అయితే ఈ ఒప్పందానికి ప్రతిఫలంగా భారత్కు అమెరికా బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారతీయ ఉత్పత్తులపై గతంలో విధించిన 50 శాతం సుంకాలను 18 శాతానికి తగ్గిస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. దీంతో భారతీయ ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్లో మంచి డిమాండ్ లభిస్తోంది. ఇదీ చూడండి: మా చమురు కొనుగోలు ఆపేస్తామని భారత్ చెప్పలేదు.. అమెరికాతో ట్రేడ్ డీల్ వేళ రష్యా సంచలన ప్రకటన
జాతీయ ప్రయోజనాలే పరమావధి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత్ తన వైఖరిని స్పష్టంగా చెప్తూ వస్తోంది. తక్కువ ధరకు లభించే రష్యా చమురును కొనుగోలు చేయడం ద్వారా తన దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడమే తమ ప్రాధాన్యత అని ఢిల్లీ వాదిస్తూ వచ్చింది. అయితే అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చాక సమీకరణాలు వేగంగా మారాయి. అయితే వాణిజ్య యుద్ధం కంటే సహకారం మేలని భావించిన అగ్రరాజ్యం.. చమురు దిగుమతులపై ఆంక్షలు పెట్టేందుకు భారత్ను ఒప్పించడంలో సఫలీకృతమైందని రూబియో మాటల ద్వారా అర్థం అవుతోంది.
రష్యా చమురును నిలిపివేయడం వల్ల భారత్కు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ.. అమెరికా మార్కెట్లో లభించే సుంకాల మినహాయింపు ఆ నష్టాన్ని పూడ్చుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 25 శాతం సుంకాల రద్దు వల్ల ఐటీ, ఫార్మా, టెక్స్టైల్ రంగాలకు భారీ ప్రయోజనం చేకూరనుంది. కానీ రష్యా చమురును భారత్ కొనుగోలు చేయకపోతే.. ఈ రెండు దేశాల మధ్య ఉన్న దశాబ్దాల నాటి మైత్రిపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రష్యాకు బదులుగా భారత్ ఇకపై మిడిల్ ఈస్ట్ లేదా అమెరికా నుంచే ఎక్కువ చమురును దిగుమతి చేసుకునే అవకాశం ఉంది.
