Kate Middleton : ఇటీవలే బ్రిటన్ రాజు ఛార్లెస్-3 (75) క్యాన్సర్ బారినపడగా.. ఇప్పుడు ఆయన పెద్ద కోడలు, యువరాజు విలియమ్ సతీమణి కేట్ మిడిల్డన్ (42)కు కూడా క్యాన్సర్ నిర్ధారణ అయింది. శుక్రవారం స్వయంగా ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తాను ప్రస్తుతం కీమోథెరపీ తీసుకుంటున్నానని వెల్లడించారు. ‘‘ప్రస్తుతం బాగానే ఉన్నాను. మరింత శక్తిమంతంగా తయారయ్యేందుకు చికిత్సపై దృష్టి పెట్టాను. మా ప్రైవసీని గౌరవించండి’’ అని ఆమె కోరారు. 2011లో పెళ్లి చేసుకున్న విలియం, కేట్లకు ముగ్గురు సంతానం.
We’re now on WhatsApp. Click to Join
వీడియో సందేశంలో కేట్ మిడిల్డన్ (కేథరిన్) మాట్లాడుతూ.. ‘‘ జనవరిలో నాకు పొత్తికడుపు శస్త్రచికిత్స జరిగింది. ఆ తర్వాత చేయించుకున్న వైద్య పరీక్షల్లో నాకు క్యాన్సర్ ఉందని తేలింది. దీంతో నేను కీమోథెరపీ చేయించుకోవడం మొదలుపెట్టాను’’ అని వివరించారు. ఈ వీడియోలో కేట్.. జీన్స్, జంపర్ ధరించి అలసిపోయినట్లు కనిపించారు. ‘‘నాకు క్యాన్సర్ ఉందని తేలడంతో మా ఫ్యామిలీ షాక్కు గురైంది. ఈ గడ్డుకాలాన్ని మేం కష్టతరంగా ఎదుర్కొంటున్నాం. మేం చేయగలిగినదంతా చేస్తున్నాం’’ అని ఆమె తెలిపారు. ‘‘ఈ వ్యాధిని ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరూ విశ్వాసాన్ని, ఆశను కోల్పోకండి. ఈ పోరాటంలో మీరు ఒంటరి కాదు’’ అని కేట్(Kate Middleton) తెలిపారు. క్యాన్సర్ బారిన పడిన వారందరి గురించి తాను ఆలోచిస్తున్నానని యువరాణి చెప్పారు. కేట్ మిడిల్డన్కు వచ్చిన క్యాన్సర్ ఏమిటనే విషయాన్ని బయటికి చెప్పలేమని కెన్సింగ్టన్ ప్యాలెస్ వెల్లడించింది.
కేట్ మిడిల్డన్ జనవరి నుంచి దాదాపు మూడు నెలల పాటు కనిపించకపోవడంతో కొన్ని పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. యువరాజు విలియంకు ఓ యువతితో ఉన్న అఫైర్ ఉందనే ప్రచారం బ్రిటన్ మీడియాలో జరిగింది. సారా రోజ్ హాండ్బరీ అనే యువతితో బ్రిటన్ యువరాజు విలియంకు అఫైర్ ఉందనే టాక్ వినిపించింది. గతంలో ఇదే విషయాన్ని నేరుగా కేట్ తన భర్త విలియం ఎదుట ప్రస్తావించగా.. ఆయన నవ్వుతూ కొట్టిపారేశారనే ప్రచారం జరిగింది.