Sunita Williams : అమెరికాలోని నాసాకు చెందిన భారత సంతతి వ్యోమగామి సునితా విలియమ్స్ కీలక ప్రకటన చేశారు. తాను త్వరలో భారత్లో పర్యటిస్తానని ఆమె వెల్లడించారు. తన తండ్రి దీపక్ పాండ్యా పుట్టిన భారతదేశానికి త్వరలోనే తిరిగి వెళ్తానన్నారు. ఇండియాలో ఉన్న తమ బంధువులు, సన్నిహితులతో ముచ్చటించాలని ఉందని సునిత చెప్పారు. 9 నెలల పాటు అంతరిక్షంలో ఉన్న సమయంలో తనకు ఎదురైన అనుభవాలను వారితో పంచుకోవాలని ఉందన్నారు. తాను భారత సంతతి బిడ్డను అని చెప్పుకునేందుకు గర్వంగా ఉందని సునిత పేర్కొన్నారు. అంతరిక్ష యాత్రల్లో విజయాలను సాధిస్తున్న దేశాల సరసన భారత్ నిలుస్తుండటం గర్వంగా ఉందని ఆమె చెప్పారు. భారత పర్యటనలో భాగంగా ఇస్రో శాస్త్రవేత్తలతో సునితా విలియమ్స్ భేటీ అయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో భారత్ చేపట్టే అంతరిక్ష మిషన్లలో భాగం కావాలనే ఆసక్తి ఆమెకు ఉందని తెలుస్తోంది.
Also Read :Nithyananda Death : నిత్యానంద స్వామి కన్నుమూత..?
అంతరిక్షం నుంచి ఇండియా ఇలా..
అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపించింది ? అని మీడియా అడిగిన ప్రశ్నకు సునితా విలియమ్స్(Sunita Williams) బదులిచ్చారు. భారత దేశం అద్భుతంగా కనిపించిందన్నారు. త్వరలోనే భారత్కు వెళ్లి తీరుతానన్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) హిమాలయాల పైనుంచి వెళ్లిన ప్రతి సారీ తమకు చాలా అద్భుతంగా అనిపించిందని తెలిపారు.ఆ ఫొటోలను తన తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్ తీశారన్నారు. గుజరాత్, ముంబై మీదుగా ఐఎస్ఎస్ వెళ్తున్నప్పుడు, సముద్ర తీరం వెంట ఉండే మత్స్యకారుల పడవలు తమకు సిగ్నల్స్లా కనిపించేవన్నారు. భారత్లోని మహా నగరాల నుంచి లైట్ల నెట్వర్క్ చిన్న నగరాల మీదుగా వెళ్తున్నట్లు కనిపించేదన్నారు.
Also Read :Sea Cucumbers : సముద్రపు దోసకాయలపై స్మగ్లర్ల కన్ను.. కేజీ రూ.30వేలు.. ఏమిటివి ?
సునిత తండ్రిది గుజరాతే..
భారత సంతతికి చెందిన న్యూరో అనాటమిస్ట్ దీపక్ పాండ్యా, స్లొవేనియన్ అమెరికన్ ఉర్సులైన్ బోనీ దంపతులకు 1965 సెప్టెంబర్ 19న అమెరికాలోని ఒహాయోలో సునితా విలియమ్స్ జన్మించారు. పాండ్యా దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో చిన్న కుమార్తె సునిత. ఇక దీపక్ పాండ్యా గుజరాత్లో జన్మించారు. ఆయన 1958లో అమెరికాకు వలస వెళ్లారు.