అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మరోసారి కాల్పుల(Firing) హింస భయానక రూపం దాల్చింది. నార్త్ కరోలినా రాష్ట్రంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం సమీపంలో ఉన్న అమెరికన్ ఫిష్ కంపెనీ రెస్టారెంట్(American Fish Company Restaurant) వద్ద ఈ ఘటన జరిగింది. ఒక బోటుపై నుంచి ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో అక్కడున్నవారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక పోలీసులు వెల్లడించారు.
Fee Reimbursement: స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ రూ.400కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్
సాక్షుల తెలిపిన ప్రకారం.. బోటులో వచ్చిన నిందితుడు అకస్మాత్తుగా రెస్టారెంట్ ప్రాంతంలోకి తుపాకీతో కాల్పులు జరిపాడు. క్షణాల్లోనే ఈ ప్రదేశం అల్లకల్లోలంగా మారింది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించగా, పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని అధికారులు తెలిపారు. కాల్పుల తర్వాత నిందితుడు అదే బోటులో పారిపోయినట్లు సమాచారం. అతడిని పట్టుకునేందుకు పోలీసులు, కోస్ట్ గార్డ్లు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ సంఘటన మరోసారి అమెరికాలో గన్ హింసపై చర్చను మళ్లీ తెరపైకి తెచ్చింది. గన్ కంట్రోల్ చట్టాలను కఠినతరం చేయాలనే డిమాండ్లు పెరుగుతున్న వేళ ఇలాంటి ఘటనలు ఆందోళనకరమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలు ఎక్కువగా వచ్చే పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలను బలోపేతం చేయాలని స్థానిక వాసులు కోరుతున్నారు. ఇదిలావుంటే, ఈ దారుణంపై అమెరికా అంతటా సంతాపం వ్యక్తమవుతుండగా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని పౌర సమాజం డిమాండ్ చేస్తోంది.