12 Gazans Drown : పాలస్తీనాలోని గాజా ప్రాంతం బార్డర్లను గత రెండున్నర నెలలుగా ఇజ్రాయెల్ మూసేసింది. దీంతో గాజాలోకి ఒక్క ఆహారపు మెతుకు కూడా భూమార్గం మీదు వెళ్లడం లేదు. దీంతో గాజా ప్రాంతంలోని దాదాపు 23 లక్షల మంది ప్రజలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది ఆకలిచావుల బారినపడ్డారని తెలుస్తోంది. ఓ వైపు గాజాపై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్కు ఆయుధాలను అమ్ముతున్న అమెరికా, ఫ్రాన్స్ దేశాలు.. మరోవైపు కంటితుడుపు చర్యగా విమానాల ద్వారా గాజా భూబాగంలోకి సహాయక సామగ్రిని జారవిడుస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో ఇలా విమానాల నుంచి జారవిడుస్తున్న సహాయక సామగ్రి పెట్టెల్లో కొన్ని సముద్రంలో పడిపోతున్నాయి. ఆకలికేకలతో అల్లాడుతున్న గాజా ప్రజలు చివరకు సముద్రంలో పడిన ఆహార ప్యాకెట్లను కూడా వదలడం లేదు.సముద్రంలోకి దూకి ఈత కొడుతూ ఆ ఫుడ్ బాక్స్లను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఈవిధంగా చేస్తూ తాజాగా ఉత్తర గాజాలోని బెత్లహియా పట్టణంలో 12 మంది గాజావాసులు ప్రాణాలు కోల్పోయారు. గాజాలోని ఆహార సంక్షోభానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనం. ఈ ఘటనపై స్పందించిన అమెరికా.. ‘‘గాజాలోకి మేం విమానం ద్వారా జారవిడిచిన 18 బండిల్స్లో మూడు బండిల్స్ పారాచూట్స్ పనిచేయక సముద్రంలో పడిపోయాయి’’ అని వెల్లడించింది. అయితే 12 మంది చనిపోయిన(12 Gazans Drown)సమాచారాన్ని అమెరికా కన్ఫార్మ్ చేయలేదు.
ఈనేపథ్యంలో సహాయక సామగ్రిని గాలిలోంచి పంపడం సరికాదని, ఈ చర్యలను వెంటనే నిలిపివేయాలని పాలస్తీనా ప్రభుత్వం కోరింది. ఈ నెల ప్రారంభంలోనూ గాజా సిటీకి పశ్చిమాన ఉన్న అల్ షాతి క్యాంప్లో ఎయిర్డ్రాప్డ్ సహాయ ప్యాకేజీలు మీద పడడంతో ఐదుగురు వ్యక్తులు మరణించగా.. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఇజ్రాయెల్ ఆర్మీ దాడుల వల్ల 2023 అక్టోబరు 7 నుంచి ఇప్పటివరకు 33వేల మందికిపైగా గాజా ప్రజలు చనిపోయారు. దాదాపు లక్ష మంది గాయాలపాలయ్యారు. వారికి చికిత్స అందించేందుకు హాస్పిటళ్లు కూడా ఇప్పుడు గాజాలో లేవు. ఎందుకంటే.. వాటిపైనా బాంబులు వేసి ఇజ్రాయెల్ పేల్చేసింది. ఎంతోమంది డాక్టర్లను ఇజ్రాయెల్ ఆర్మీ కడతేర్చింది.