New Virus: మానవాళికి మరో ముప్పు?

గడ్డ కట్టిన ఓ సరస్సు అడుగు భాగంలో 48,500 ఏళ్ల నాటి రాకాసి వైరస్‌ను తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు.

గడ్డ కట్టిన ఓ సరస్సు అడుగు భాగంలో 48,500 ఏళ్ల నాటి రాకాసి వైరస్‌ను తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. దాంతో పాటే రెండు డజన్ల కొత్త వైరస్‌ల ఉనికి కూడా బయటపడింది. రష్యాలోని సైబీరియా ప్రాంతం ఏడాదిలో ఎక్కువ రోజులు మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడి మంచు పొరల కింద సేకరించిన నమూనాలను సేకరించి పరీక్షించిన ఐరోపా పరిశోధకులు, వాటిలో 13 రకాల హానికారక సూక్ష్మజీవ జాతులను గుర్తించి, వర్గీకరించారు. వీటిని జాంబీ వైరస్‌లు (దెయ్యపు వైరస్) గా భావిస్తున్నారు. ఇవి వేలాది సంవత్సరాలుగా నిధారణ స్థితిలో ఉన్నప్పటికీ, వ్యాధికారక శక్తిని మాత్రం కోల్పోలేదని తెలుసుకున్నారు. కర్బన ఉద్గారాల వినియోగం ఎక్కువ కావడం వల్ల ఉష్ణోగ్రతలు పెరగడంతో మంచు ఖండాలు, పంచు పర్వతాలు వేగంగా కరిగిపోతున్నాయని తద్వారా గతంలో చిక్కబడిన మీథేన్ వంటి గ్రీన్ హౌస్ వాయువుల విడుదల వాతావరణ మార్పులను మరింత ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలు చాలా కాలం నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు.

అయితే దీని ప్రభావం నిధారణ స్థితిలో ఉన్న పురాతన వైరస్‌లపై ఎలా ఉంటుందన్నది స్పష్టత లేదు. రష్యా, జర్మనీ, ఫ్రాన్స్‌లకు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో భాగస్వాములుగా ఉన్నారు. అత్యంత ఘనీభవించిన ఈ మంచు కరిగిపోయి రాకాసి వైరస్‌లు భూవాతావరణంలోకి విడుదలైతే జంతువులు, మానవాళికి పెను సమస్యగా పరిణమిస్తాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాహ్య వాతావరణంలోకి ఇవి ప్రవేశించిన తర్వాత ఎంతకాలం వ్యాధికారకంగా ఉంటాయో? వాటిని ఎలా ఎదుర్కోవాలో? ఈ వైరస్‌లకు, మానవాళికి మధ్య వాహకాలు ఏమిటో? అంచనా వేయడం ఇప్పటికీ అసాధ్యంగానే ఉందని అభిప్రాయపడ్డారు. ఇవి కలిగించే ముప్పును అంచనా వేయలేమని వ్యాఖ్యానించారు.