Economic Crisis Looms: హోర్ముజ్ జలసంధిపై అమెరికా విధించిన నౌకాదళ ఆంక్షలు ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక ప్రభావాలను చూపుతున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గం గుండా అంతర్జాతీయ సరఫరాలో ఎక్కువ భాగం జరుగుతుంది. తాజా నివేదికల ప్రకారం.. ఈ ఆంక్షల కారణంగా ఇరాన్ ప్రతిరోజూ సుమారు 435 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 3600 కోట్లు) నష్టాన్ని ఎదుర్కొంటోంది. ఇందులో ఎగుమతులు తగ్గడం వల్ల 276 మిలియన్ డాలర్లు, దిగుమతులు నిలిచిపోవడం వల్ల 159 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోంది.
ఇరాన్పై ప్రభావం ఎలా ఉంది?
ఈ ఆంక్షలు ఏప్రిల్ 13, 2026 నుండి అమలులోకి వచ్చాయి. ఇరాన్ పోర్టుల వైపు వెళ్లే, అక్కడి నుండి వచ్చే నౌకలను అడ్డుకోవాలని అమెరికా నిర్ణయించింది. ఇతర దేశాల నౌకలను నేరుగా ఆపకపోయినప్పటికీ అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల సముద్ర రాకపోకలు గణనీయంగా తగ్గిపోయాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి చమురు ఎగుమతులపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపింది. ప్రతిరోజూ సుమారు 20 లక్షల బారెల్స్ చమురు ప్రపంచ మార్కెట్కు చేరడం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ ఈ చర్యను ‘సముద్రపు దొంగతనం’గా అభివర్ణించింది. ప్రతీకార చర్యలు చేపడతామని హెచ్చరించింది. మరోవైపు ఐరోపా దేశాలు కూడా ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణిస్తూ, సముద్ర మార్గాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఆర్థిక వ్యవస్థకు పొంచి ఉన్న ముప్పు
అమెరికా తీసుకున్న ఈ చర్య వల్ల ఇరాన్పై కోలుకోలేని దెబ్బ పడే అవకాశం ఉందని ఫారిన్ పాలసీ ఇన్స్టిట్యూట్ (FDD) సీనియర్ ఫెలో మియాద్ మలేకి అభిప్రాయపడ్డారు. హోర్ముజ్ జలసంధిలో అమెరికా నౌకాదళ దిగ్బంధనం కారణంగా ఇరాన్ ఎగుమతుల్లో ప్రతిరోజూ దాదాపు 276 మిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూస్తుందని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
Also Read: Abhishek Sharma : డకౌట్స్ లో అరుదైన రికార్డు సాధించిన అభిషేక్
మియాద్ మలేకి విశ్లేషణలోని ముఖ్యాంశాలు
ఇరాన్ వార్షిక వాణిజ్యంలో 90 శాతానికి పైగా పర్షియన్ గల్ఫ్ గుండానే జరుగుతుంది. దీని విలువ సుమారు 109.7 బిలియన్ డాలర్లు. ఇరాన్ మొత్తం ఎగుమతి లాభాల్లో 80 శాతం, అలాగే దేశ జీడీపీ (GDP)లో నాల్గవ వంతు చమురు, గ్యాస్ రంగం నుండే వస్తుంది. ఇరాన్ రోజుకు 15 లక్షల బారెల్స్ ముడి చమురు ఎగుమతి చేయడం ద్వారా దాదాపు 139 మిలియన్ డాలర్లు ఆర్జిస్తోంది. అమెరికా దిగ్బంధనం వల్ల ఇదంతా నాశనమయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
